3 June, 2026 | 5:22 PM

హరీష్ రావు జన్మదినం సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

03-06-2026 04:42 PM

- బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

- బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్: బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించారు. కోమటిబండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రోడ్డు ప్రమాదంలో, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, మాజీ సర్పంచ్ సుమన్ గుండెపోటుతో, ములుగు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ అనారోగ్యంతో, కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు.

ఈ నేపథ్యంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం భాస్కర్ భార్య కవిత, సుమన్ భార్య నవ్య, ప్రవీణ్ భార్య రాధ, ఎల్లయ్య భార్య బాలమణికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, హరీష్ రావు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి హరీష్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఆపద సమయంలో అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ఎంపీపీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.