3 June, 2026 | 5:22 PM

మహిళల భద్రత, బాలల రక్షణపై అవగాహన

03-06-2026 04:30 PM

వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఫిర్యాదు చేయాలి

భూపతిపూర్ లో షీ టీం అవగాహన సదస్సు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనర్  అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం  సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ మహిళల భద్రత, బాలల రక్షణ,సైబర్ నేరాలు,ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై మహిళలకు అవగాహనకల్పించారు. మహిళల భద్రత కోసం బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో షీ టీమ్ నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని తెలిపారు.

ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యను తెలియజేయాలనిసూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.ప్రస్తుతం అనేక మంది అత్యాశకు లోనై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు,లోన్ యాప్‌ల బారిన పడుతున్నారని పేర్కొంటూ,అలాంటి మోసాలకు దూరంగా ఉండాలనిసూచించారు. ఒకవేళ ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని కోరారు. మహిళలు ఏదైనా ప్రమాదం, బెదిరింపులు లేదా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటే వెంటనే 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆసియా బేగం, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మి,షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.