కడియం శ్రీహరికి గుణపాఠం తప్పదు
- స్పీకర్ ఎదుట కడియం వింత సమాధానాలు
- బయట తొడ కొడుతుండు లోపల పిల్లి గంతులేస్తుండు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
- 4 గంటలకు పైగా కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన పిటిషనర్ తరఫు న్యాయవాదులు
హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి) : ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదు ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మా జీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్లో పార్టీలోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ శనివారం విచారించారు. కడియం శ్రీహరి విచారణ ముగిసింది.
స్పీకర్ ఎదుట కడియం శ్రీహరి వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద కీలక వ్యాఖలు చేశారు. స్పీకర్ ఎదుట కడియం అయోమయంగా సమాధానం ఇస్తున్నారని, బయట తొడ కొడుతుండ ఆయన లోపల మాత్రం పిల్లి గంతులేస్తుండు ధ్వజమెత్తారు. 4 గంటలకు పైగా కడియం శ్రీహరిని పిటిషనర్ వివేకానంద తరుఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వివేకానంద అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరికి వింత పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు.
బయట తొడ కొడుతూ.. కేసీఆర్ను తిడుతున్న కడియం శ్రీహరి అసెంబ్లీ లోపల స్పీకర్ ముందు ‘నేను పార్టీ మారలేదు’ అని పచ్చి అబద్ధాలు చెప్తుండు అని ఆరోపించారు. ఆయన అనేక పదవుల అనుభవించి అవగాహన లేకుండా అయోమయంలో సమాధానం చెప్తుండన్నారు. ‘నేను పార్టీ మారినట్లు అపోహలో బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారు’ అని ఉల్టా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ ఒకసారి తెల్వదు, ఇంకోసారి తెలుసు అని చెప్తున్నారని ఆగ్రహించారు.
పేపర్లో ఫొటో ఎక్కడిది అని అడిగితే అది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అని చెప్పడం ఆయన రాజకీయ జీవితానికి సిగ్టుచేటని, రాజకీయంగా కడియం శ్రీహరి సమాధి చేసుకుండని, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బుకాయింపులతో కాలయాపన చేస్తున్నారని, ‘నా సోషల్ మీడియా అకౌంట్లో నా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు’ అని చెప్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ను తప్పుదోవ పట్టించొచ్చు కానీ న్యాయ స్థానంలో నీవు తప్పించుకోవని, కడియం శ్రీహరికి న్యాయస్థానంలో గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే వివేకానంద హెచ్చరించారు.




