31-05-2025 12:16:41 AM
- భారీగా ఆస్తి నష్టం
-పటాన్చెరులో ఘటన
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి)/పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని ఫర్నిచర్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి భారీ ఆస్తినష్టం జరిగింది. పాటి గ్రామ సమీపంలో ఉన్న అను ఫర్నిచర్ పక్కన వెల్డింగ్ చేస్తున్న క్రమంలో మిరుగులు ఫర్నిచర్పై పడి మంటలు ఏర్పడ్డాయి.
సిబ్బంది మధ్యాహ్నం భోజనాలకు వెళ్లడంతో మంటలు అంటుకున్న విషయాన్ని గమనించలేదు. దీంతో క్రమంగా మంటలు భారీగా వ్యాపించాయి. పటాన్చెరు, సంగారెడ్డి నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పేందుకు శ్రమించాయి. ఈలోపే మంటలు భారీగా వ్యాపించడంతో ఫర్నిచర్ అంతా అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది.
మధురనగర్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మధుర నగర్ రెసిడెన్షియల్ భవనంలో శుక్రవారం మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మధురానగర్ మెట్రో సమీపంలోని ఓ ఐదు అంతస్తుల రెసిడెన్సియల్ భవనంలోని రెండవ అంతస్తులో ఏసీ నుంచి శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి.
రెండవ అంతస్తులో ఉంటున్న ప్రజలు బెదిరిపోయి కిందకు దిగారు. రెండవ అంతస్తు నుంచి మిగతా అంతస్తులకు మంటలు వ్యాప్తిస్తుండగా గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని ఎంతో శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.