13-06-2025 11:18:44 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామ సమీపంలో కబ్జాకు గురవుతున్న గ్రామ చెరువును కాపాడాలని మత్స్య సంఘం నాయకులు కోరారు. శుక్రవారం లక్ష్మీసాగర్ గ్రామ శివారులోని చెరువు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మత్స్య సంఘం నాయకులు సత్యం మాట్లాడుతూ.. తమ గ్రామ సమీపంలోని చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి పంటలు పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .తాము చేపలు పట్టి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో చెరువు కబ్జాకు గురి కావడంతో చేపలు పెరగకపోవడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కబ్జాకు గురవుతున్న చెరువును కాపాడాలని మత్స్యకారుల విజ్ఞప్తి చేశారు.