- 4,31,348 దరఖాస్తులు పరిష్కారం
- దరఖాస్తుల్లో సగానికిపైగా రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాలకు వినతులు
- ప్రజావాణిలో ప్రత్యేక నోడల్ అధికారి నియామకం
- దరఖాస్తు తీసుకోగానే రెఫరెన్స్ ఐడీతో ఫోన్కు ఎస్ఎంఎస్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం వరకు 5,23,940 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 4,31,348 అర్జీల ను పరిష్కరించగా, 92,592 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందని తెలిసింది. ఎక్కువగా రేషన్ కార్డులు, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్ల గురించే విజ్ఞప్తులు వచ్చాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలు మినహా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు అక్కడికక్కడే పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి ప్రతి మంగళ, శుక్రరాల్లో మహాత్మ జ్యోతిభాపూలే ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది.
అందుబాటులో వివిధ శాఖ అధికారులు
- ప్రజావాణి డెస్క్లో రెవెన్యూ నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీసీఏఎల్ అధికారులు, పోలీస్ విభాగం నుంచి సీఐ, డీఐజీ, డీసీపీ ర్యాంకు అధికారులు, హెల్త్తోపాటు అన్ని సంక్షేమ విభాగాల నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటున్నారు.
- ఆరోగ్యశ్రీ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ డెస్క్. అత్యవసర సేవల నిమిత్తం మెడికల్ హెల్ప్ డెస్క్, అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది. మహిళా బాధితులకు తోడుగా ఉండేందుకు సఖి వాహనం, పిల్లలకు బాలరక్ష అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది.
- దివ్యాంగుల అర్జీల స్వీకరణకు ప్రత్యేక డెస్క్. వివిధ ప్రాంతాల నుంచి సమస్యలను, వినతులను చెప్పుకునేందుక విచ్చే ప్రజలకు రూ.5కే భోజనం.
- ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అక్కడే స్కాన్ చేసి, రెఫరెన్స్ ఐడీ నంబర్ నమోదు చేసి సంబంధిత విభాగానికి పంపిస్తున్నారు. అర్జీదారుని ఫోన్ నంబర్కు ఆ దరఖాస్తు రెఫరెన్స్ ఐడీ నంబర్ ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు.
- గతంలో ఒకే అర్జీదారుడు రెండు, మూ డుసార్లు వచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య అభిప్రాయపడ్డారు. వీలైనంత వేగంగా సమస్యలు పరిష్కారమవుతున్నా యి. ఒక వేళ అర్జీదారుడు ఒకే వినతిపై రెండు, మూడు సార్లు ప్రజావాణికి వస్తే తెలిసిపోయేలా ఆన్లైన్ విధానం అమలులో ఉంది. అర్జీదారుడు మొబైల్ నంబ ర్ నమోదు చేయగానే తన పిటిషన్ స్కాన్ కాపీ ప్రత్యక్షమవుతుంది.
- దరఖాస్తులు స్టేటస్ను కూడా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకు సీజీజీ ద్వారా పోర్టల్ను ప్రభుత్వం డెవలప్ చేయించింది.
పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను తక్షణ పరిష్కారానికి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు. అర్టీలు రాయడం రానివాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడున్న సిబ్బంది అర్జీదారుల సమస్యను తెలుసుకుని రాసిస్తారు. ఆ దరఖాస్తును ఏ విభాగానికి అందించాలో కూడా అధికారులు సాయం చేస్తున్నారు. అర్జీలను స్వీకరించేందుకు విభాగాలవారీగా ప్రత్యేక డెస్క్ను ఏర్పాటుచేశారు. ప్రజావాణిలో నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ దివ్య, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు.