15-06-2025 01:46:53 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఆయా సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలను దృష్టి పెట్టుకుని కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా అలర్ట్ అవుతున్నాయి. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా వేటిని నిర్వహించినా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే భవిష్యత్లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ గెలుపుపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
వాస్తవానికి 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల మినహా ఇతర రాష్ట్రవ్యాప్త ఎన్నికలేవి జరగలేదు. దీంతో అన్ని పార్టీలు స్థానిక సంస్థలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార పార్టీ ఏడాదిన్నర పాలనకు స్థానిక ఎన్నికల్లో గెలుపే రెఫరెండంగా భావిస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దానిని వారికి అనుకూలంగా మలచుకోవాలని పావులు కదుపుతున్నాయి.
బీసీలకు 42 శాతం అంశంతో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియరైనా, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణిని అవలంబించింది. అయితే సంక్షేమ పథకాల అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో ఆలస్యం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలో చాలా వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాల అమలు కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ పథకాలు కూడా కార్యరూపం దాల్చడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేలా కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను పూర్తిస్థాయిలో వినియోగించుకొని భవిష్యత్లో నిర్వహించే అన్ని ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అయితే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలంటే ప్రస్తుతం ఎన్నికల నిర్వహించడమే సరైన సమయమని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షేమ పథకాల అమలు అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. దీనినే ప్రధానం ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటుంది.
అసంతృప్తులే ప్రతిపక్షాల టార్గెట్...
అధికార పక్షానికి ధీటుగా ప్రతిపక్షాలు సైతం స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. భవిష్యత్లో జరగబోయే ఎన్నికల్లో బీసీల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కులగణన, 42 శాతం రిజర్వేషన్ అంశం ప్రభుత్వానికి సానుకూల ప్రభావం తీసుకొచ్చినప్పటికీ అందులో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని బీసీలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని యోచిస్తున్నాయి. దీంతోపాటు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెబుతున్న అధికార పార్టీ తాజాగా జరిగిన మంత్రి వర్గ విస్తరణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికీ మాత్రమే స్థానం కల్పించింది. మొత్తంగా మంత్రి వర్గంలో కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. దీంతో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదనను ప్రతిపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి.
దీంతోపాటు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పొందని అసంతృప్తులపై ప్రతిపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలను లేవనెత్తి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్తుందని పాలక, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
భవిష్యత్లో జరిగే అన్ని ఎన్నికల్లో గెలవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందులో భాగంగా రాబోయే ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.
అవినీతిపై విచారణ అస్త్రంగా..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాళేశ్వరం కుంగుబాటు కీలకపాత్ర పోషించింది. అయితే రాష్ర్ట ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అవినీతిని బయటపెట్టే పనిలో పడింది. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలోని ప్రధాన నాయకులకు టెన్షన్ మొదలైంది.
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినప్పటికీ ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఇప్పుడు బీజేపీలో ఉండటంతో కాళేశ్వరం అవినీతి మచ్చ ఇరు పార్టీలకు అంటుకోనున్నది. ప్రతిపక్షాల అవినీతిని అధికారపక్షం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహం రచిస్తోంది. ఒకేసారి రెండు ప్రధాన పక్షాలకు చెక్ పెట్టనున్నది.
ఇందులో భాగంగా విచారణను వేగవంతం చేసింది. కాళేశ్వరం అవినీతిపై విచారణకు నియమించిన ఘోష్ కమిషన్ ఇప్పటికే 113 మందిని విచారించింది. అయితే విచారణలో భాగంగా కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరయ్యారు. దీంతో తర్వాత హరీశ్రావు, కేసీఆర్ విచారణ రానున్న నేపథ్యంలో తదిపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి వీరు ముగ్గురు ఒకే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం వేర్వేరు పార్టీలో ఉండటంతో కాళేశ్వరం అవినీతికి అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలు బాధ్యులయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నిరూపించి, రెండు ప్రధాన పక్షాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని నిగ్గుతేల్చి రాబోయే ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి, ప్రతిపక్షాలను కట్టడి చేసేలా వ్యూహరచన చేస్తోంది. తద్వారా వచ్చే అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించాలని యత్నిస్తోంది.