calender_icon.png 6 June, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతమంతా పతారా!

05-06-2025 12:00:00 AM

  1. ఇప్పుడేమో పత్తా లేకుండా పోయిన మాజీలు
  2. కార్యకర్తల్ని అన్నింటికీ వాడుకుండ్రు క్యాడర్కు కష్టమొస్తే కన్పిస్తలే.. 
  3. ఉమ్మడి జిల్లాలో అజ్ఞాతంలోకి పలువురు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

నల్లగొండ, జూన్ 4( విజయక్రాంతి) : పదేండ్ల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు తమ హావా చూపించారు. ప్రతి పనిలోనూ తమదే పైచేయి సాగిస్తూ వచ్చారు. గల్లీల్లో వేసే సీసీ రోడ్ల దగ్గరి నుంచి ప్రభుత్వ స్కీముల్లో స్కాముల వరకు రూ.కోట్లు కొల్లగొట్టేశారు. తమ స్వార్థం కోసం బీఆర్‌ఎస్ క్యాడర్ను రెచ్చగొట్టి అప్పటి ప్రతిపక్షాలపై ఊసిగోల్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక లీడర్లు చెప్పారనే ఊపుతో వెనుకా ముందు చూసుకోకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలు సైతం రెచ్చిపోయారు. తమకు ఇక ఎదురే లేదన్నట్టుగా ప్రశ్నించినోళ్లను తొక్కుకుంటూ పోయారు. ప్రజాసమస్యలపై గొంతెత్తినోళ్లను ఏదో ఒక సాకుతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. అందుకోసం క్యాడర్ ఆర్థికంగా.. సామాజికంగానూ ఎంతగానో నష్టపోయారు.

కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడూ ఎమ్మెల్యేలు, లీడర్లు పట్టించుకోలేదు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తలను కీలుబొమ్మలుగా వాడుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పదేండ్ల పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట కావడంతో కార్యకర్తలు అదే ఉత్సాహాంతో ఏ పిలుపునిచ్చినా..

ముందు వెనుకా చూసుకోకుండా దూసుకెళ్లారు. కొంతమంది ఎమ్మెల్యేలైతే ఇతర పార్టీల నుంచి అసలైన బీఆర్‌ఎస్ లీడర్లు, కార్యకర్తలను రాజకీయంగా, ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. తీరా అధికారం కోల్పోవడంతో అండగా నిలబడాల్సిన మాజీ ఎమ్మెల్యేలు, కీలక లీడర్లు పత్తా లేకుండా పోయారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హావా..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. 2018 ఎన్నికలకు వచ్చేసరికి అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ గులాబీ మయం అయిపోయాయి. రెండు లోక్సభ స్థానాలు మాత్రం కాంగ్రెస్ చేతిలోనే ఉండిపోయాయి. దీనికితోడు ఒక రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్ చేతిలోనే ఉన్నాయి.

దీంతో పదేండ్ల పాటు జిల్లాలో బీఆర్‌ఎస్ రాజ్యం నడిచింది. దీంతో అప్పటి సర్కారు తీసుకొచ్చిన ప్రతి స్కీములోనూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రధానంగా ఎమ్మెల్యేలు, లీడర్ల అనుచరులకే దక్కాయి. బీఆర్‌ఎస్ లీడర్లు సైతం పలుమార్లు మా పార్టీకే ఇచ్చుకుంటామంటూ గప్పాలు కొట్టారు. దీంతో అనివార్యంగా కొంతమంది కారు లోడు ఎక్కువైనా.. బీఆర్‌ఎస్లో చేరారు.

అయితే దళిత బంధు, బీసీ బంధు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కల్యాణ లక్ష్మీ తదితర పథకాల్లోనూ ఇతర పార్టీల కార్యకర్తలపై వివక్షత చూపుతూ పోయారు. దీనికితోడు కొంత మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలను తరచూ అవమానించడం.. గెలుక్కునేలా ప్రవర్తించడంతో పరిస్థితి నిత్యం కొన్ని గ్రామాల్లో వివాదస్పదంగా ఉండేది.

సోషల్ మీడియాలోనూ బీఆర్‌ఎస్ రచ్చ..

స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యేలు, లీడర్లు సోషల్ మీడియాలో భాగంగా క్యాడర్ను పావులుగా వాడుకున్నారు. లేనిపోనివి సృష్టించి ప్రతిపక్షాలపై ట్రోలింగ్ భారీ స్థాయిలో చేశారు. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం బీఆర్‌ఎస్ విపరీతంగా సోషల్ మీడియాను వినియోగించింది. పల్లె.. పట్టణం అనే తేడా లేకుండా.. ప్రతి వార్డులో, గ్రామాల వారీగా సోషల్ మీడియా గ్రూపులు సృష్టించి పోస్టులతో రచ్చ రచ్చ చేశారు.

ఇందుకోసం కొంతమంది కార్యకర్తలను స్పెషల్గా ఎంచుకున్నారు. వారితో ఎమ్మెల్యేలు, కీలక లీడర్లు నిత్యం టచ్లో ఉండడంతో కార్యకర్తలు సైతం రెట్టింపు ఉత్సాహంతో అబద్దపు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు బీఆర్‌ఎస్ను పాతాళంలోకి బొంద పెట్టేశారు.

నియోజకవర్గాల్లో కన్పిస్తలేరు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే.. నేడు పట్టుమని సగం మంది కూడా నియోజకవర్గాల్లో కన్పిస్తలేరు. ఉమ్మడి జిల్లాలో మాజీమంత్రి జగదీష్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మినహా మిగతా వారెవ్వరూ ప్రజల్లో కి రావడం లేదు.

ప్రధానంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, పైళ్ల శేఖర్ రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అసలు నియోజకవర్గాల్లోకి తొంగి చూడడం లేదు. అసెం  బ్లీలో కార్యకర్తలు ఆపదలో ఉంటూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అయితే ఫుల్ టైమ్ బిజినెస్ మోడ్లోకి వెళ్లిపోయినట్టు కన్పిస్తోంది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అసలు జిల్లాలో ఉన్నారో.. లేదోననే అనుమానాలు బీఆర్‌ఎస్ క్యాడర్ వ్యక్తం చేస్తోంది. నిజానికి కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన బొల్లం మల్లయ్యయాదవ్,

భాస్క ర్ రావు, రవీంద్రకుమార్, నోముల భగత్ ఇతర పార్టీల నుంచి వచ్చినప్పటికీ.. లోకల్ క్యాడర్ను కాదని ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చారు. అయినా సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసినోళ్లంతా కష్టపడి వాళ్లను గెలిపించారు. తీరా ఇప్పుడు క్యాడర్కు క్షేత్రస్థాయిలో అండగా నిలబడాల్సిన సమయంలో పత్తా లేకుండాపోయారు.