05-06-2025 12:00:00 AM
రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
హనుమకొండ, జూన్ 4 (విజయ క్రాంతి): బుధవారం భద్రకాళి దేవస్థానం సమీపంలో రూ.1.3 కోట్ల వ్యయంతో శ్రీ భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లతో కలిసి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభిచారు.
అదేవిధంగా భద్రకాళి ఆలయం ముందు రాజగోపుర నిర్మాణ పనుల శిలాఫలకాన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఇతర వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వేద పాఠశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.
ఆలయాలకు వేద పండితులను అందించేందుకు వేద పాఠశాల ఉపయోగపడుతుందని అన్నారు. వీలైనంత త్వరగా వేద పాఠశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. భద్రకాళి మాఢ వీధుల నిర్మాణ పనులకు దాదాపు రూ.30 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భద్రకాళి చెరువు కూడా పూడిక మట్టితో నిండి ఉందని, తద్వారా నీటి నిల్వ సామర్థ్యం తక్కువైన సందర్భంలో పూడికతీత అనేది సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. ఆలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఆలయాల్లోపల విగ్రహాలు లేవని పేర్కొన్నారు.
అన్ని దేవాలయాలను పరిశీలించా లని, సరైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సలహాదారు గోవిందుహరి కి సూచిం చినట్లు తెలిపారు. భద్రకాళి దేవస్థానం అభివృద్ధికి భవిష్యత్తులోనూ కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, ట్రస్టీ, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం, వేద పండితులు పాల్గొన్నారు.