20-06-2025 11:44:07 PM
వర్షాకాలంలోనూ రైతులను కష్టాల పాటు చేస్తుంది..
మహబూబ్నగర్ను ఏం చేయదలచుకున్నారు..
అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు..
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్..
హైదరాబాద్ (విజయక్రాంతి): జూరాలకు వరద పొటెత్తుతున్నా నీళ్లు తరలించాలన్న సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయని, ఆల్మట్టి, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా వాటిని వాడుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్(Former Minister Srinivas Goud) విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటిని వాడుకోవడంపై ఇప్పటి వరకు కనీసం ఒక సమీక్ష కూడా చేయలేదన్నారు. జూరాలపై ఆధార పడ్డ నెట్టెంపాడు, బీమాలకు నీళ్లు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి ముందే వర్షాలు పడ్డా నీళ్లు సద్వినియోగం చేసుకోకుండా కిందకి వదులుతున్నారని మండిపడ్డారు.
యాసంగిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, ఈ వర్షాకాలంలో నీళ్ళుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉందన్నారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్కు ఈ దుస్థితి ఏమిటని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా ఆరునెలల్లో నీళ్లు ఇస్తామన్నారని, ఇంకా ఎప్పుడిస్తారని అడిగారు. మహబూబ్నగర్ జిల్లాను ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు.
అధికారులందరూ మొద్దు నిద్రలో ఉన్నారని అన్నారు. కేసీఆర్ హయాలో పడ్డ ప్రతీ వాన చినుకును సద్వినియోగం చేసుకునేలా అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి ఉండేదని తెలిపారు. రిజర్వాయర్లు ఉన్న ప్రాంతంలో మంత్రులు అధికారులు పర్యటించాలని సూచించారు. గత పదేళ్లలో రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందాయని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. వస్తున్న వరదతో రిజర్వాయర్లు నింపేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాలని, భవిష్యత్లో రిజర్వాయర్లు నింపక పోతే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.