03-02-2026 09:18:14 PM
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అ పదవులకే వన్నెతెచ్చిన రామన్న
రాంరెడ్డి లేని లోటు తీర్చలేనిది మంత్రి శ్రీధర్ బాబు సంతాపం
మంథని,(విజయక్రాంతి): మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామిరెడ్డి అనారోగ్యంతో మృతి మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస వదిలారు. ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ నుండి ఎంపీపీగా ఎమ్మెల్యేగా గెలిచిన రామన్న ఆ పదవులకే వన్నె తీసుకొచ్చారు. గ్రామస్తులతో పాటు నియోజకవర్గ ప్రజలు ముద్దుగా రామన్న అని పిలుచుకునే రాంరెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం ముఖ్యంగా మంథని ప్రాంతానికి సాగునీరు అందించడంలో రైతుల పక్షాన కొట్లాడి జైలుకు కూడా పోయి వచ్చాడు.
1994 లో మంథని ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటికీ స్పీకర్ పదవిలో ఉన్న దుద్దిళ్ల శ్రీపాద రావుపై విజయం సాధించారు. స్వగ్రామమైన ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అక్కడి నుంచే ఎంపీటీసీగా గెలిచి ముత్తారం మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అంతరం 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ఎన్టీఆర్ ప్రభంజనంలో గెలిచిన ఆయన 1999 ఎన్నికల్లో శ్రీపాద రావు తనయుడు ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి చవిచూశారు.
ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం రెబల్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్తి ఓటమికి కారకుడయ్యాడు. ఆ తరువాత వరుసగా మూడోసారి ఓటమి చవి చూసిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినా, చివరి నిమిషంలో పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీజేపీ లో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఆయన కుమారుడు సునీల్ రెడ్డి చురుకైన భూమిక నిర్వర్తిస్తున్నారు.
రాంరెడ్డి మరణం తీరని లోటు మంత్రి శ్రీధర్ బాబు
రాంరెడ్డి మృతిపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సర్పంచ్ నుంచి ఎంపీపీ ఎమ్మెల్యే దాకా ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి రామిరెడ్డి అని ఆయన మరణం మంత్రి నియోజకవర్గానికి తీరని లోటు అని అన్నారు. మంత్రి తో పాటు మంథనిలో రాంరెడ్డితో సన్నిహితంగా ఉండే ప్రముఖులు పలువురు ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం మంథని గోదావరి తీరంలో ఆయన అంతిమ సంస్కారం ఉంటుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.