తేజస్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ
ఖమ్మం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): పార్లమెంట్ వేదికగా బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. 15వ లోక్సభలో తాను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి ఓటు వేశానని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం నాలుగు కోట్ల ప్రజల మనోభావాలను తీవ్రంగా అవమానించడమేనని ఆయన అన్నారు.
ఎంతోమంది అమరుల త్యాగాలు, ప్రజల దీక్షలు, దీర్ఘకాల ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని స్పష్టం చేశారు. కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన పోరాటంతో ఈ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పూర్తిగా చట్టబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, దానిని తక్కువ చేసి చూపించేలా వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాష్ట్రానికి గౌరవం ఇవ్వాలని, ఇలాంటి వ్యాఖ్యలు దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండి స్పందించకపోవడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడే విషయంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై నిలబడాలని సూచించారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడటంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.






