08-05-2025 03:24:36 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు.
గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి 5950 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలో 11,482 కోట్లు ఖర్చు చేసిందని భట్టి చెప్పారు.90 లక్షల కుటుంబాలకు 10 లక్షల వరకూ లబ్ధి చేకూర్చి వైద్యం అందించామని, గత ప్రభుత్వం గాలికి వదిలేసిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన వైద్య రంగాన్ని గాడిన పెడుతున్నట్లు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్య రంగానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలో రైతాంగానికి అండగా నిలిచి రుణమాఫీ చేశామని, నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నామన్నారు. 9 వేల కోట్లుతో రాజీవ్ యువ వికాసంతో యువత నిరుద్యోగులను ఆదుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.