08-05-2025 02:55:46 PM
లక్ష రూపాయల అప్పు కోసం మరో వ్యక్తి వద్ద జీతం పెట్టిన పిన్ని బాబాయిలు.
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే కోల్పోయిన ఓ అనాధ బాలుడిని చిన్నాన్న చిన్నమ్మ చేసిన అప్పులను తీర్చడం కోసం ఓ వ్యక్తి వద్ద జీతం కుదిర్చారు. చిట్టి చేతులతో ఆటలాడుకోవాల్సిన ఆ పసి బాలుడు పశువుల బద్ద పేడ ఎత్తడం, పొలం పనులు, ఇంటి పనులు చేయడం వంటి పరిమికి మించి బరువులను ఎత్తి వెట్టిచాకిరికి బలవుతున్నాడు. లక్ష రూపాయల అప్పు తీర్చేందుకు ఏడాది కాలంగా ఇంట్లో వెట్టిచాకిరి తప్పలేదు. చివరికి ఈ పనులు నేను మోయలేను అంటూ సొంత గ్రామానికి పారిపోయినా విడవలేదు. ఇంటికెళ్లి మరీ ఈడ్చుకొచ్చి మళ్ళీ పనిలోకి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మేనత్త కుమారుడు మేన బావ చిన్నాన్న చిన్నమ్మలతో గొడవపడి చివరికి ఆ బాలుడిని రక్షించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వేడుకున్నాడు.
ఆయనా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. బిజినపల్లి మండలం పట్టం గ్రామానికి చెందిన బోడ పెద్ద మల్లయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తన భార్య జంగమ్మ అనారోగ్య కారణాలతో తాను మృత్యువాత పడింది. దీంతో అనాధగా మారిన బాబును వరుసకు మేనత్త అయిన గాలమ్మ గంగారం గ్రామానికి తీసుకెళ్లి 5వ తరగతి వరకు చదివించింది. నాగర్ కర్నూల్ మండలం నల్లవెల్లి గ్రామంలో నివాసం ఉంటున్న బాలుడి చిన్నమ్మ చిన్నాన్న తాము చదివించుకుంటామంటూ తీసుకెళ్లారు. కానీ అదే గ్రామంలోని వెంకట్ రెడ్డి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తెచ్చుకొని ఆ అప్పు చెల్లించడం కోసం ఆ 14ఏళ్ల బాలుడిని జీతానికి కుదీర్చారు. చదువు కూడా మాన్పించి వెట్టి చాకిరి చేయించడంతో బరువు బాధ్యతలను తట్టుకోలేక బాలుడు పారిపోయి మేనత్త వద్దకు వచ్చాడు. అయినా వినకుండా ఆ బాలుడుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మళ్ళీ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మేన బావ శివ 14 ఏళ్ల బాలుడిని వెట్టి నుంచి విముక్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను వేడుకున్నాడు. ఆయనా మూడు రోజులుగా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.