ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం/అమీన్పూర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని.. వాటి బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
విద్యారంగం అభివృద్ధికి బాల వికాస ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వారికి సూచించారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోల్ టెక్ కంపెనీ సహకారంతో బాలవికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను మంగళవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన, ప్రతిభకు కృషి తోడైతే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. పాఠశాల నుండి ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు లేకపోవడం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రత్యక్షంగా చూస్తున్నానని.. వెంటనే సిసి రోడ్డు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ తాన్యను ఆదేశించారు. వావిలాల గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ తాన్య, బాల వికాస్ ఫౌండేషన్ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి రెడ్డి, కౌన్సిలర్లు అశోక్, సతీష్, కో ఆప్షన్ సభ్యులు రవీందర్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ఆయా వార్డుల ప్రజా ప్రతినిధులు, ప్రోగ్రాం మేనేజర్ తిరుపతి, మోల్ టెక్ పరిశ్రమ ప్రతినిధి ఉగేష్ తదితరులు పాల్గొన్నారు.






