calender_icon.png 15 June, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక

14-06-2025 12:00:00 AM

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

మహబూబాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను స్థానిక వాగుల నుంచి ఉచితంగా తెచ్చుకోవడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగూడా, గంగారం మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక ఆశలతో ఏండ్ల తరబడి ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు సొంత ఇంటి కల నిజం కాలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల కలను ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిజం చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పేదలకు ఇచ్చే ఐదు లక్షల కు తోడుగా ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా తెచ్చుకోవడానికి అధికారులు స్థానిక వాగుల్లో ఇసుక రీచ్ లను గుర్తించి, ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేయాలని, లబ్ధిదారులు అక్కడినుండి ఉచితంగా తెచ్చుకోవడానికి తగిన సహకారం అందించాలన్నారు.

మారుమూల గిరిజన ప్రాంతాల్లోని నిలువ నీడలేని గిరిజనులకు అదనంగా ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ములుగు నియోజకవర్గ పరిధిలో 3,500 కు తోడు 1,500 ఇండ్లు కేవలం గిరిజన ప్రాంతాలకు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకుని తమ పిల్లలను చక్కగా చదివించి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషి చేయాలన్నారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పేదలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా బోధన జరుగుతుందని, ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు సమకూరుస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

కొత్తగూడ మండలం గోవిందపురం లో 20 లక్షల వేయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అదే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన బోయం రజిత శ్రీను దంపతుల ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఆర్డీవో కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు

ములుగు,జూన్13(విజయక్రాంతి): ప్రతి ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరు అందించుటకు నీటి శుద్దీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయితి రాజ్ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నీటి శుద్దీకరణ యంత్రాన్ని (ఆటోమేటిక్ క్లోరినేషన్ డౌసింగ్ సిస్టము)రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన ‘ఈ సాంకేతికత లక్షలాది మందిని తాగునీటి సమస్య నుండి కాపాడుతుందని, ప్రతి గ్రామీణ ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరు అందుతుందని,సెన్సార్ పీడ్బ్యాక్ ఆధారంగా ఆటోమేటెడ్ డోసింగ్ అవుతుంది. మానవ తప్పిదాలు,  నిర్వహణ ప్రయత్నాలను బాగా తగ్గిస్తుందని తెలుపుతూ ఈ సాంకేతికత జల్ జీవన్ మిషన్ కోసం ఒక ముఖ్యమైన ముందడుగు అని సార్వత్రికంగా స్వచ్ఛమైన తాగునీటిని పొందాలనే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని తెలిపారు.

ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెని ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ద్వారా ఎంపానెల్ చేయబడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపాల్ కమిషనర్ సంపత్,ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు,మాజి పంచాయతీ కార్యదర్శి రఘు,తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులు సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలి.

జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచుతూ మత్స్యకారుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర పంచాయితి రాజ్ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో యుఎస్టి,నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో జీవంతరావుపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన కుటుంబాలకు 25తెప్పలు చేపలు పట్టే వలలు రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జీవంతరావుపల్లి గ్రామంలో అధికంగా ఉన్న మత్యకారులకు నిర్మాణ్ సంస్థ వారు తెప్పలు వలలు అందించడం చాలా అభినందిందనీయం అని నిర్మాణ్ సంస్థ వారికి అభినందించారు.జీవంతరావు పల్లి గ్రామాన్ని ప్రభుత్వ పథకాల అమలులో పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎన్నుకుని ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త రేషన్ కార్డుల మంజూరు,ములుగు మున్సిపాలిటీలో కలవడం గ్రామానికి డబుల్ రోడ్డు, సెంటర్ లైటింగ్ తో అభివృధి జరుగుతుందని గ్రామాన్ని మోడల్ గ్రామంగా నిర్మించుకుని అందరూ ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాలని అశాభావం వ్యక్తం చేశారు.