24-01-2026 01:35:27 AM
న్యూఢిల్లీ, జనవరి 21: భారతదేశపు మార్గదర్శక పూర్తి -ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్సు సర్వీస్ అయిన ఫ్రెష్ బస్, బెంగళూరుకు చెందిన టెక్ కంపెనీ అయిన ఎక్స్పోనెంట్ ఎనర్జీతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి రాపిడ్-ఛార్జింగ్, లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్ ప్లాట్ఫామ్ను పరిచయం చేస్తుంది. ఈ భాగస్వామ్యం కింద, 250 వరకు ఎలక్ట్రిక్ బస్సులను నడపటానికి ఫ్రెష్ బస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఫ్రెష్ బస్ త్వరలో అధిక డిమాండ్ ఉన్న హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో సేవలను ప్రారంభించనుంది.
సాధారణంగా ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ బస్సులు, 350 కి.మీ. పరిధికి పరిమితం చేయబడ్డాయి. ఫ్రెష్ బస్, ఎక్స్పోనెంట్ ఎనర్జీతో కలిసి, 15 నిమిషాల రాపిడ్ ఛార్జింగ్ ద్వారా ఈవీ బస్సుల కోసం అపరిమిత పరిధిని అందుబాటులోకి తీసుకువచ్చేలా రూపకల్పన చేసింది. దీనిద్వారా హైవేలపై సైతం ఈ బస్సులు 1,000 కి.మీ ట్రిప్ రూట్లకు కూడా సేవ చేయడానికి వీలు కలుగుతుంది. వేగవంతమైన ఛార్జింగ్ అనేది కేవలం భారీ బ్యాటరీలను జోడించడం కంటే సహజంగానే మరింత సమర్థవంతంగా ఉంటుందని ఫ్రెష్ బస్ వ్యవస్థాపకుడు, సీఈఓ సుధాకర్ చిర్రా అన్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం యొక్క విస్తారమైన ఇంటర్సిటీ నెట్వర్క్ను ఎలక్ట్రిక్ బస్సులు జయించలేవనే అపోహను తొలగించబోతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే సుదూర మార్గాల్లో డీజిల్ బస్సులను ఈవీ లతో భర్తీ చేసే అవకాశాన్ని రాపిడ్ ఛార్జింగ్ తీసుకొస్తుందని ఎక్స్పోనెంట్ ఎనర్జీ వ్యవస్థాపకుడు , సీఈఓ అరుణ్ వినాయక్ చెప్పారు.హైవే పిట్స్టాప్ల సమయంలో ప్రతి 300 కి.మీ.కు 15 నిమిషాల క్విక్ ఛార్జ్, డీజిల్ వాహనం తరహా కార్యకలాపాలకు వీలు కల్పిస్తుందన్నారు.