ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలి
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
కామారెడ్డి,(విజయక్రాంతి): దేశంలో మహాత్మా గాంధీ పేరుతో అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును యధావిధిగా కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని దేశంలోని పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజలకు జీవనాధారం కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఉపాధి కల్పించాలనే 2005లో పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన అన్నారు.
ఉపాధి హామీ చారిత్రక సంక్షేమ పథకమని గాంధీజీ పేరు తీసేయడం ద్వారా ఆయన ఆశయాలను, త్యాగాలను తుంగలో తొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90 శాతం నిధులు ఇస్తుండగా, కొత్త చట్టంతో 60 శాతం నిధులు మాత్రమే కేంద్రం ఇస్తుందని, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలనడం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవడమేనన్నారు. నిధులు తగ్గించడం, పేరును మార్చే ప్రయత్నం సరికాదని గాంధీజీ ఆశయాలే దేశానికి మార్గదర్శకమని, ఉపాధి హామీ పథకానికి యధావిధిగా గాంధీ పేరు కొనసాగించాలని ఆయన కోరారు.






