25-06-2025 12:17:24 AM
-రూ.4 లక్షల సొత్తు స్వాధీనం, పరారీలో ప్రధాన నిందితుడు
-వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్, జూన్ 24(విజయక్రాంతి): మెదక్ పట్ణణంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను పట్టుకొని రూ.4 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన కూర శేఖర్ ఇంట్లో ఈనెల 8వ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులైన హైదరాబాద్కు చెందిన గుడాల సతీష్, గుడ్డు రాజులను అరెస్టు చేసి వారి వద్ద కారు, ఆటో, 4.5 కిలోల వెండి వస్తువులు, 5 గ్రాముల బంగారం, మూడు కెమెరాలు, కీపాడ్ ఫోన్, ఐప్యాడ్, శాంసంగ్ ఐప్యాడ్, 326 డాలర్లు, అమెరికన్ సెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రధాన నిందితుడు తిరుమల్ పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. దొంగతనం కేసులో రూ.8 లక్షల విలువలైన వస్తువులు చోరీకి గురికాగా ఇప్పటి వరకు రూ.4 లక్షల విలువైన వస్తువులు రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు దొరికితే మిగతా సొత్తును రికవరీ చేస్తామని చెప్పారు. కాగా నిందితులను రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో డీఎస్పీతో పాటు సీఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, టౌన్ సీఐ మహేశ్, రూరల్ ఇంచార్జి సీఐ రాజారెడ్డి, పోలీసు సిబ్బందిపాల్గొన్నారు.