గౌరవెల్లి ప్రాజెక్ట్ను పూర్తిచేయాలి
- త్వరలో రైతులకు సాగునీరు అందించాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, జూన్ 22 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కోరాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం 95 శాతం పూర్తయినందున రైతుల పంట పొలాలకు త్వరగా సాగునీరు అందించాలని ఆదేశించారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు అక్కన్నపేట మండలంలో132 ఎకరాలు, హుస్నాబాద్ మండలంలో 235, కోహెడ మండలంలో 304 ఎకరాల భూమిని సర్వే చేసి జూలై 10 వరకు మార్కింగ్ను పూర్తి చేయాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పర్యాటకంగా అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతమని, ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రభుత్వ భూములను గుర్తించి నివేదిక అందజేయాలని తెలిపారు. హుస్నాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు చేపలను సరఫరా చేసేలా మత్స్య సంపదను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశంకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ శంకర్, హుస్నాబాద్, సిద్దిపేట ఆర్డీవోలు రామ్మూర్తి, సదానందం తదితరులు పాల్గొన్నారు.






