calender_icon.png 28 June, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండవుల గుట్ట వద్ద జియో-హెరిటేజ్ ఇన్ఫర్మేషన్ పానెల్ బోర్డు ఏర్పాటు

28-06-2025 10:03:21 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) రేగొండ మండలంలో ఉన్న పాండవుల గుట్ట జియోటూరిజం సైట్‌లో జియో-హెరిటేజ్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్ బోర్డును(Pandavula Gutta Geo-heritage site) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. పాండవుల గుట్ట రాళ్ల నిర్మాణాల భౌగోళిక ప్రాముఖ్యత, వయస్సు, పురాతన శిలా చిత్రాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ ఏర్పాటు చేసిన సమాచారం ప్యానెల్ బోర్డు‌ను  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మంజు ఎస్  ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రమేష్ సామల, రమేష్ గుండా, తుషార్ చంద్ర పటేల్, అశోక్ కుమార్ కలబతులా హాజరయ్యారు..ఈ ప్రదేశానికి భౌగోళిక ప్రాముఖ్యత ఉండటానికి కారణం అనన్యమైన రాళ్ల నిర్మాణాలు, గుహలు, శిలా తావులు ఉండటమే కాక, ఇవి భారతదేశ భౌగోళిక చరిత్రకు వెలుగులిచ్చే విశేషాలను పొందుపరిచారు. పాండవుల గుట్ట, పాఖల్ సూపర్‌ గ్రూప్‌ లోని ములుగు గ్రూప్‌కు చెందిన జకారం ఫార్మేషన్ లోని మోటే ధాన్యాల శిలలు కలిగి ఉంది. దీనికి చరిత్రలో విశేష ప్రాధాన్యత ఉంది. పల్లెటూరి ప్రజల జీవన శైలిని ప్రతిబింబించే ప్యాలియోలిథిక్ శిలాచిత్రాలు, మేసోలిథిక్ నుంచి మధ్యయుగాల వరకు నివాస స్థానాల ఆధారాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ శిలా చిత్రాల్లో ప్రధానంగా బైసన్, కృష్ణజింక, పులులు, చిరుతపులులు వంటి పెద్ద జంతువుల బొమ్మలు కనిపిస్తాయి.

ఈ శిలా చిత్రాలకూ తోడు, రష్ట్రకూటుల కాలానికి చెందిన శాసనాలు, మధ్య యుగాంతంలోని ఫ్రెస్కో చిత్రాలు కూడా ఈ కొండలపై గుర్తించబడ్డాయి. ఈ చిత్రాలు పూర్వాధికాళ ప్రజల జీవన శైలి, విశ్వాసాలను తెలియజేస్తూ ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ చిత్రాలు, నివాస స్థలాల ఉనికి ఈ ప్రాంతంలో ప్రాచీనకాలం నుండే మానవ వ్యవసాయాన్ని సూచించడమే కాక, ఈ ప్రదేశ భౌగోళిక ప్రాధాన్యాన్ని మరింతగా వివరిస్తున్నాయి. పాండవులగుట్టలో కనిపించే భౌగోళిక లక్షణాలు, ప్యాలియోలిథిక్ జీవన చరిత్ర ఆధారాలను సందర్శకులు అర్థం చేసుకునేందుకు బోర్డులో ఏర్పాటుచేసిన సమాచారం ఎంతో ఉపయోగకరమని శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక జియో-హెరిటేజ్ ప్రదేశంగా ఉన్న పాండవులగుట్టను ప్రజలు తప్పకుండా సందర్శించి, దాని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చారిత్రక ప్రాధాన్యతను అనుభవించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.