10-08-2024 04:53:38 AM
ముంబై, ఆగస్టు 9: రిజర్వ్బ్యాంక్ పాలసీ ప్రకటన నేపథ్యంలో క్రితం రోజు పడిపోయిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పటిష్టంగా పుంజుకున్నది. గ్యాప్అప్తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ముగింపువరకూ అదే ఊపును ప్రదర్శించింది. ఒక దశలో 1,098 పాయింట్లు ర్యాలీ జరిపి 79,984 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 820 పాయింట్లు లాభపడి 78,705 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 302 పాయింట్లు పెరిగి 24,419 పాయింట్ల గరిష్ఠస్థాయికి తగ్గిన అనంతరం చివరకు 250 పాయింట్ల నష్టంతో 24,367 పాయింట్ల వద్ద నిలిచింది.
యూఎస్ జాబ్స్ డేటాతో సెంటిమెంట్ మెరుగు
అమెరికాలో జాబ్లెస్ క్లెయింలు తగ్గాయన్న వార్తలతో మాంద్యం భయాలు సన్నగిల్లాయని, దాంతో ఈక్విటీ మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్ పటిష్టంగా ఆరంభమై ఒక శాతంపైగా లాభపడిందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,276 పాయింట్లు (1.57 శాతం) నష్టపోగా, నిఫ్టీ 350 పాయింట్లు కోల్పోయింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్, హాంకాంగ్లు పెరగ్గా, షాంఘై క్షీణించింది. యూరప్ సూచీలు పాజిటివ్గా ముగిసాయి. జాబ్స్ డేటా వెలువడిన తర్వాత గురువారం యూఎస్ మార్కెట్లు భారీ ర్యాలీ జరిపాయి.
టెక్ మహీంద్రా టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్లో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 2.8 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫోసిస్లు 2.5 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకీలు తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.21 శాతం ర్యాలీ చేయగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.79 శాతం పెరిగింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఐటీ ఇండెక్స్ 1.59 శాతం లాభపడింది. కన్జూమర్ డిస్క్రీషనరీ, రియల్టీ ఇండెక్స్లు 1.56 శాతం చొప్పున పెరిగాయి. ఆటోమొబైల్స్ ఇండెక్స్ 1.51 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 1.41 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.37 శాతం చొప్పున లాభపడ్డాయి.
పెరిగిన సంపద రూ.4.46 లక్షల కోట్లు
తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.46 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,46,309 కోట్లు పెరిగి రూ.4,50,21,816 కోట్లకు (5.37 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ఈ ఏడాది విదేశీ పెట్టుబడులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, దేశీయ సంస్థలు భారీ నిధుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నందున భారత మార్కెట్ ఒడిదుడుకుల్ని తట్టుకుంటున్నదని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు.