28-06-2025 12:07:25 AM
మండలిలో ప్రతిపక్ష నేత మధుసుదనాచారి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ చరిత్ర అంతా బీసీలను మోసం చేయడమేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసన సభా, మండలిలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తానని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతానని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి మర్చిపోయారని ఆయన విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయడం లేదని మండిప డ్డారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో మధుసుదనాచారి మీడియాతో మాట్లాడుతూ .. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ పాలకులపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం రేవంత్రెడ్డి విఫమయ్యారని ఆరోపించారు. బీసీ బిల్లు శాసన సభలో ఆమోదం పొంది మూడు నెలలు పూర్తయినా, ఈ మూడు నెలల్లో కనీసం 10 పర్యాయాలు మంత్రివర్గ విస్తరణ, కప్పం కట్టడానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.
బీసీ సబ్ప్లాన్, బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీజేపీ కూడా బీసీలను మోసం చేస్తోందని, మోదీ హయాంలో కేంద్ర బడ్జెట్లోనూ బీసీలకు మొండి చెయ్యేచూపించారన్నారు.