calender_icon.png 28 June, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రంలో రోడ్డు విస్త‘రణం’ దశల వారి ఆందోళనలు

28-06-2025 12:07:22 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియాలో రోడ్డు విస్తరణ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రోడ్డును 80 ఫీట్ల నుండి 60 ఫీట్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు విస్తరణ బాధితులు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించారు. శుక్రవారం కేసముద్రం పట్టణంలో సమావేశమై దశలవారీగా చేపట్టే విస్త‘రణం’ కార్యాచరణను ప్రకటించారు. సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ, మంగళవారం బంద్, వచ్చే నెల 7 నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ బట్టు శ్రీను, ఎం సిపిఐ (యు) జిల్లా అధ్యక్షుడు కంచ వెంకన్న, బిజెపి జిల్లా కోశాధికారి వోలం శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కేసముద్రంలో 60 ఫీట్ల రోడ్డు సరిపోతుందని, కొద్ది రోజులుగా తాము ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు.

తమ ఆందోళనలు విజ్ఞప్తులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ తో 80 ఫీట్ల రోడ్డును నిర్మాణాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా 80 ఫీట్ల రోడ్డును నిర్మించడం తగదన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, 80 ఫీట్ల రోడ్డుతో కేసముద్రంలోని ఉప్పరపల్లి రోడ్డు, మార్కెట్ రోడ్డు, కేసముద్రం విలేజ్ ప్రాంతాల్లో 600 కుటుంబాలు వీధిన పడనున్నాయని తెలిపారు. రోడ్డు వెడల్పులో అనేకమంది తమ దుకాణాలు, ఇల్లు కోల్పోతున్నారని తెలిపారు. దీంతో తాము ఉపాధిని కోల్పోవడం కాక నివసించేందుకు నిలువ నీడ వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.