29-05-2025 01:34:52 AM
-విద్యార్థులే నా అంబాసిడర్లు..
-ఉద్యోగ నోటిఫికేషన్లు అడ్డుకుంటున్న వారిని నిలదీయండి
-పదేళ్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్
-ఒక్క ఏడాదిలోనే 59వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
-వివక్షలేకుండా అందర్నీ ఒకేచోట చదివిస్తాం
-ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి
-తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్ని నిధులైనా ఖర్చుచేస్తాం: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు గొర్రెలు, బర్రెలు కాస్తూ, చెప్పులు కుట్టుకోవాలా? రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలే దని సీఎం రేవంత్రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని మండిపడ్డారు. కేసులు వేసి ఉద్యోగ నోటిఫికేషన్లను అడ్డుకుంటున్నారని, అటువంటి పార్టీలను నిలదీయాలని పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి విమర్శించారు.
బుధవారం బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్రామ్ భవన్లో జరిగిన టెన్త్, ఇంటర్తోపాటు ఐఐటీ, ఎన్ ఐటీ, నీట్, స్పోర్ట్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని కొనసాగించేం దుకు తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. అలాగే మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని, ఇలా ప్రజల కోసం పాటుపడినవారే చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకులాలను ఏర్పాటు చేసి పక్కన నెట్టివేసిందని, దాంతో ఆయా వర్గాల్లో ఆత్మనూన్యత భావన ఉండేదన్నారు. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి, అందరినీ ఒకేచోట చదివిస్తామన్నారు.
వీటితోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ప్రతిభను వెలికితీస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు తీసుకొచ్చిందని, డిగ్రీలు, పీజీలు చేసిన పిల్లలు మళ్లీ ఆ పనులే చేసుకోవాలా? అని ప్రశ్నించారు. మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
సామాజిక సమస్యగా మారుతోంది..
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ చెలగాటమాడింది వాస్తవం కాదా? అని సీఎం ప్రశ్నించారు. కానీ తాము వచ్చిన మొదటి ఏడాదిలోనే 59వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు అందజేశామన్నారు.
మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలా లేదన్నారు. గత ప్రభుత్వం పరీక్షలను సరిగా నిర్వహించేలేకపోయిందని, ప్రశ్నపత్రాలను పల్లీ బఠానీలుగా అమ్ముకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ పోటీపరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించామన్నారు.
గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామని, కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామకపత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నాయని, అందుకే ఇది సామాజిక సమస్య గా మారుతోందన్నారు.
గ్రూప్ 89 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కాయని సీఎం వెల్లడించారు. వాళ్లిం ట్లోని కుటుంబసభ్యులు ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెళ్లు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని, కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని, అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండని సీఎం పిలుపునిచ్చారు.
పరీక్షలను వాయిదా వేయాలని అడుగుతున్న వారు ఎన్నికలను వాయిదా వేయమని అడుగుతారా? అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం యువతను ప్రోత్స హించేలా రాజీవ్గాంధీ అభయహస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయమందిస్తున్నామన్నారు. మన విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే ఎక్కడున్నా రాష్ట్రానికి సేవ చేస్తారన్నారు. మీరే నా అంబాసీడర్లని చెప్పారు.
ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సామాజిక తెలంగాణ, ఆత్మగౌరవంతో బతకాలి అన్న ఒక ప్రత్యేక లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ఈ ప్రభుత్వం ఏర్పడిం ది దొరలు, దయ్యాల కోసం కాదు.. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు నిధులు కేటాయించడమే కాకుండా తూచ తప్పకుండా వాటిని ఖర్చు చేస్తున్నామన్నారు.
గతంలో పంచిన అసైన్డ్ భూములు వెలికితీసి పేదలకు పంచాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డల భవిష్యత్తే రాష్ర్ట భవిష్యత్తు అని, వారికోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామన్నారు. ఒకే సంవత్సరంలో దాదాపు 104 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూ రు చేసామని, ఒక్కో పాఠశాలను రూ.200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు.
గతంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు ఉండేవి కావని, ఫంక్షన్ హాళ్లలో, రైస్ మిల్లుల్లో ఉండేవని ఆరోపించారు. నిరుద్యోగయువతకు స్వయంఉపాధి కల్పించి ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఎనిమిది వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు చేయూత అందించేందుకు రాజీవ్ యువవికాసం పేరిట స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2నుంచి అమలు చేయబోతున్నట్టు తెలిపారు.
ప్రజాప్రభుత్వం రాగానే సంక్షేమ వసతిగృహాల్లోని బిడ్డల భవిష్యత్తు మన రాష్ర్ట భవిష్యత్తుగా భావించి నెల రోజుల్లోనే అధికారుల ద్వారా నివేదికలు తెప్పించి 40శాతం డైట్చార్జీలు, 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
తమ ప్రభుత్వంలోనే ఉన్నత పదవులు..
వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని వీసీగా నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్కుమార్ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు. ఇంకా ఎంతోమందిని ఉన్నత స్థానాల్లో నియమించామని పేర్కొన్నారు.
కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, వేం నరేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్సీ గురు కులాల సొసైటీ కార్యదర్శి అలగు వర్షి ణి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీని కి ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సీఎం ప్రారంభించారు. అనంతరం గురుకులాల్లో వందకు వంద శాతం ఫలితాలు సాధించిన ప్రధానాచార్యులకు బహుమతులు ప్రదానం చేశారు.