19-01-2026 12:24:56 AM
పరిశుభ్రత కరువు * ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
ధర్మపురి, జనవరి18(విజయక్రాంతి):రాష్ట్రంలోనే అంత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వెల్గటూర్ మండలం కోటిలింగాల గోదావరినది అపవిత్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుండి నిత్యం భక్తులతో కిటకిటలాడే కోటిలింగాల గోదావరి నది చెత్త,చెదారము, ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయింది. స్నానం ఆచరించే భక్తులు వ్యర్ధాలవల్ల వెలువడే దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గోదావరి జలాలపై ఆధారపడే రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోటిలింగాల దేవస్థానంకు లక్షల్లో ఆధాయం ఉన్నప్పటికీ పరిశుభ్రత, సౌకర్యాలు మాత్రం శూన్యoగా ఉన్నాయి. నదిలోకి చెత్త ప్రవేశిస్తున్న అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం వ్యర్ధాలు నీటిలో వెయ్యొద్దు అనేలా సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడం అధికారుల నిర్లక్ష్యంకు అద్దం పడుతుంది. మహాశివరాత్రి సందర్బంగా రానున్న రోజుల్లో కోటిలింగాలకు భక్తుల తాకిడి మరింత పెరగనుంది. అధికారులు, ఆలయ పాలకవర్గం వెంటనే చర్యలు చేపట్టి గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచాలనీ భక్తులు కోరుతున్నారు.