తాళం వేసిన ఇంట్లో చోరీ
బంగారు ఆభరణాల అపహరణ
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురదగగూడెంలో తాళం వేసిన సింగరేణి ఉద్యోగి ఇంట్లోకి గుర్తు తెలియని దొంగలు చొరబడి, ఆరు తులాల బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పట్టణ అదనపు ఎస్ఐ నూనె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... బురదగూడెంకు చెందిన సింగరేణి ఉద్యోగి దుర్గం రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 16న ఇంటికి తాళం వేసి, బంధువుల ఊరికి వెళ్లారు.
తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తెరిచి ఉండి, అందులో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు దుర్గం రాజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. సంఘటన స్థలాన్ని మందమర్రి సీఐ కే శశిధర్ రెడ్డి పరిశీలించారు. నేరస్తులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినందుకు సంఘటన స్థలాలలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.
ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దొంగతనాల నివారణకు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.




