19 March, 2026 | 2:20 PM

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు

19-03-2026 11:13 AM

హైదరాబాద్: తెలుగు ప్రజల సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

ఉగాది పర్వదినం(Ugadi Wishes) సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. రైతులకు సమృద్ధి పంటలు, యువతకు మంచి అవకాశాలు, మహిళలకు మరింత సాధికారత కలగాలని కోరుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని సూచించారు.