31-05-2025 08:39:58 PM
విద్యతోనే ఆదివాసీల జీవితాల్లో మార్పు...
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...
ఉట్నూర్ (విజయక్రాంతి): ఆదివాసీల జీవితాల్లో మార్పు రావాలంటే అది కేవలం నాణ్యమైన విద్యతోనే సాధ్యమవుతుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) పేర్కొన్నారు. శనివారం ఒడిశా రాష్ట్రంలోని కియేంఝర్ పట్టణ కేంద్రంలో గోండు సంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో విద్య దాని ప్రాముఖ్యత అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న విద్యా సదుపాయాలను వివరించారు.
రాష్ట్రంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సబ్బండ వర్గాలకు గుణాత్మక విద్యను అందించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులను తరగతి గదులకు పరిమితం చేసే విధంగా అమలు చేస్తున్న విద్య విధానాన్ని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆదివాసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ విద్యార్థిని, విద్యార్థులకు విద్య భోజన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆశ్రమ పాఠశాలలో చదువుకొనే విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.