సమస్యలపై ప్రభుత్వం సానుకూలం
దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధం
కొన్ని సంఘాల కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయి
ఉద్యోగులు విధులకు హాజరుకావాలి
ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభు త్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసిందని, ఈ కమిటీ మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపిందని వివరించారు.
కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, కొన్ని సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున, వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని, ఈ మేరకు ప్రభుత్వం గడువు కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అయితే, కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆక్షేపించారు.
ఇటువంటి ప్రలోభాలకు లోనుకాకుం డా, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని, అందరూ బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని ఎండీ నాగిరెడ్డి కోరారు.






