23-11-2025 01:11:52 AM
నెలకు రూ. 2,300 కోట్లు కూడా లేని వడ్డీని రూ. 7 వేల కోట్లని అబద్ధాలు
కాంగ్రెస్ తెచ్చిన రూ. 2. 3౦ లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?
రేవంత్ సర్కార్ను నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అప్పుల వివరాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి) : రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై, ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం, కొత్త అప్పులు సరిపోతున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని కాగ్ తాజా లెక్కలు పూర్తిగా కొట్టిపారేశాయని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ‘కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ అక్టోబర్ నెల నివేదిక ద్వారా మరోసారి పూర్తిగా బట్టబయలైందని స్పష్టం చేశారు. ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ. 7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారని, కానీ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక వాస్తవాలు వెల్లడించిందని తెలిపారు. కాగ్ లెక్కల ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ. 16,529.88 కోట్లు అని, నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమే అని వివరించారు.
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న దానిలో సగం కూడా వడ్డీలకు వెళ్లడం లేదని, వడ్డీల పేరుతో అబద్ధాలు చెప్పి, పాలన చేతకానితనాన్ని, తప్పులు, అవినీతిని అప్పుల మాటున దాచిపెడుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఆస్తులను సృష్టిస్తే.. కాంగ్రెస్ ఆప్పులను సృష్టిస్తున్నది
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పులను సృష్టించి రాష్ట్రాన్ని అధోగతి వైపు నడిపిస్తుందని మండిపడ్డారు. పార్లమెంటు లెక్కల ప్రకారం పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని కేటీఆర్ తెలిపారు.
ఆనాడు మిషన్ భగీరథ, కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ వేలకోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం వంటి అనేక ఉత్పాదక ఆస్తులను సృష్టించిందని, కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం లేకుండానే, ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కూడాచేయకుండానే రూ. 2. 3౦ లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు.
అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన కాగ్ నివేదికతో వడ్డీల వాదనలో డొల్లతనం బయటపడటంతో, ఇంత భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాస్తవానికి ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ‘స్కామ్గ్రెస్ ఏటీఎం’ గా మార్చారని విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి
వడ్డీల లెక్కలపై పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్ల అప్పులు ఏ ఏ పథకాలకు, ఏఏ ప్రా జెక్టుల కోసం ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాలని, అదే విధంగా,
గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను కూడా తక్షణమే ప్రజల ముందు ఉంచాలన్నా రు. ఇప్పటికైనా అప్పుల పేరు చెప్పి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను, 420 హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటే కుదరదని, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అప్పుల కాకి లెక్కలు ప్రజలు నమ్మరని తెలిపారు.