ఘనంగా మైసమ్మ తల్లి బోనాల ఉత్సవం
పాల్వంచ, ఆగస్టు 16, (విజయక్రాంతి):శ్రావణమాసం ప్రారంభం కావడంతో వాడవాడలా బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత పాల్వంచలో మైసమ్మ తల్లి బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి, బిఆర్ఎస్ 47 వ డివిజన్ ఇంచార్జ్ ముత్యాల ప్రవీణ్ దంపతులు వేరేవేరుగా పాల్గొని మైసమ్మ తల్లిని భక్తీశ్రద్ధలతో ప్రార్థించారు. జిల్లా వాసులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సుఖశాంతులతో సిరి, సంపదలు కలగాలని , సమృద్ధిగా పాడి పంటలు కలగాలని మైసమ్మ తల్లిని ప్రార్థించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తల్లికి బోనాలు సమర్పించారు. దీంతో పాత పాల్వంచ గడియ కట్ట ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.






