calender_icon.png 17 June, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బృహత్ కార్యం!

07-06-2025 12:00:00 AM

జనాభా లెక్క తేల్చేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఇది ముదావహం. జనగణన ఇప్పటికే 16 ఏండ్లు ఆలస్యమైంది. జనగణనకు మధ్యలో కోవిడ్ మహమ్మారి అడ్డు వచ్చిందని ప్రభుత్వం చెప్పుకున్నా అది సాకు మాత్రమే. 2027 మార్చి నెలకల్లా జనగణనను పూర్తి చేసేందుకు కేంద్రం ఇప్పటికైనా నడుం కట్టడం ఆహ్వానించ దగిందే. ఈ జనగణన ఎప్పుడైనా ఒక బృహత్తర కార్యక్రమమే.

ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందనేది త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్‌తోగాని స్పష్టత రాదు. జనగణనతోబాటు దేశమంతా కులగణనకు పూనుకోవడం ఈసారి ప్రత్యేకత. బ్రిటిష్ పాలనలో 1935లో దేశంలో మొదలైన జనాభా లెక్కల ప్రక్రియలో ఇలా కులగణనకు ఉపక్రమించడం ఇదే మొదటిసారి.

ఈ విషయంలో చాలాకాలం మౌనంగా వున్న బీజేపీ చివరికి రాజకీయ వత్తిడులకు తలవంచక తప్పలేదు. కులగణనను కాంగ్రెస్ ప్రధానాంశంగా తెరపైకి తేవడం, ఆ పార్టీ పాలనలో వున్న తెలంగాణలో దానిని పూర్తి చేయడం ఒక ఎత్తయితే, బీజేపీకి మిత్రపక్షంగా వున్న జేడీయూ బీహార్‌లో సొంతంగా కులగణన నిర్వహించడం కూడా బీజేపీకి సంకటంగా మారింది. 

ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆలస్యమైన జనగణనతోపాటు కులగణన కూడా జరుగుతుందని  కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించక తప్పలేదు. ఇప్పటి వరకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల జనాభా లెక్కలు వేరుగా జరుగుతూ వస్తున్నాయి. కుల ప్రాతిపదికగానే కొనసాగుతున్న దేశ రాజకీయాల్లో బీసీల లెక్కల అంశం ఇన్నాళ్లు అపరిష్కృతంగానే వుంది.

దేశవ్యాప్తంగా బీసీల లెక్కల కోసం అనేక ఏళ్లుగా పార్టీలు డిమాండ్ చేస్తూనే వున్నాయి. కుల సమీకరణలను బేరీజు వేసుకొనే పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టడం సర్వసాధారణమైంది. కులరహిత సమాజమే తమ ధ్యేయమని చెప్పుకొనే బీజేపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నిజానికి రాజకీయంగా మనుగడ సాగించాలంటే అన్ని పార్టీలకు కుల సమీకరణల బేరీజు తప్పనిసరైంది.

78 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజకీయాల్లో ‘కులం ప్రాతిపదిక’ ఒక వాస్తవంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎంతమంది బీసీలున్నారో తేలితే ఈ రాజకీయ సమీకరణలు ఇంకా ఊపందుకుంటాయి. కాని, నిజానికి కావల్సింది సామాజిక న్యాయం అని  కులాలు ఘోషిస్తున్నాయి. వనరుల సమాన పంపిణి, విధానాల రూపకల్పనలో సమ్మిళిత ఆలోచనా దృక్పథం గురించి బీసీ కులాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎంత నిజాయితీగా జనగణన, కులగణన డేటా సేకరణ జరిగితే అంత ప్రయోజనకరం. అంతేకాదు, ఆ డేటాను బాధ్యతాయుతంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. జనాభా లెక్కల తర్వాత నియోజక వర్గాల పునర్విభజన అంశం బలంగా ముందుకు రావచ్చు. కొత్త పార్లమెంటు భవనంలో అదనంగా ఏర్పాటు చేసిన సీట్లు వేచి చూస్తున్నాయి. పార్లమెంటు నియోజక వర్గాలు ఏ రాష్ట్రాల్లో పెరుగుతాయి, ఏ రాష్ట్రాల్లో పెరగవనే వివాదం అప్పుడు మరోసారి తెరపైకి రానుంది.