calender_icon.png 17 June, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఖాతాల్లోకి భరోసా నిధులు

17-06-2025 12:43:49 AM

వచ్చే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

-రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 

-గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మా నెత్తిన అప్పులకుప్ప పెట్టింది

-ఎవరెన్ని ధర్నాలు చేసినా పదేళ్లపాటు అధికారం కాంగ్రెస్‌దే 

-ఆర్థిక ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం..

-రైతుభరోసా జమ చేస్తున్నాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రంగారెడ్డి/రాజేంద్రనగర్, జూన్ 16: రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు ఆశీర్వాదం లేకపోతే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యేగా ఎవరూ గెలవలేరు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండతోనే అది సాధ్యం. రైతుల సంక్షేమం కోరుకునే పార్టీ కాంగ్రెస్.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేం రైతులకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతులు సాఫీగా సాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి కల్చర్ యూనివర్సిటీలో సోమవారం ఆయన క్యాబినెట్ మంత్రులతో కలిసి ‘రైతు నేస్తం’ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలకు సన్న బియ్యం పంపించేందుకు తమ ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహిస్తున్నదని, సన్న వడ్లకు ఎకరానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని వెల్లడించారు. 

ఇక్కడి రైతులు సన్న వడ్లు పండిం చడం వల్లే నిరుపేదలకు అవసరమైన సన్న బియ్యం పంపిణీ చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. వరి సాగులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నదని కొనియాడారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు మాత్రమే చూపించారని మండిపడ్డారు. ప్రభుత్వం కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేని, రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.

నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరి సాగు చేస్తే ఇక ఉరేనని రైతులను బెదిరించారని గుర్తుచేశారు. రైతులు ఏటా పంట మార్పిడి చే యాలని సూచించారు. తాను సీఎం అయ్యే నాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసిందని, సర్పంచ్‌ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిం ది బీఆర్‌ఎస్ సర్కారేనని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వంపై గత సర్కార్ 8.20 లక్షల కోట్ల అప్పు పెట్టిందని చెప్పుకొచ్చారు. 

రైతులు ఆత్మగౌరవంతో బతికేలా..

ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి, రైతులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించామని సీఎం పేర్కొన్నారు. చావుల పునాదులపై అధికారంలోకి రావాలనే దురాలోచనతో బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నేతలు చట్టవిరుద్ధంగా ఫోన్‌ట్యాపింగ్ చేశారని, భార్యాభర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ లేని పరిస్థితి తీసుకొచ్చారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు పూర్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చాయన్నారు.

నేటి యువత జొన్న రొట్టె తిని, ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటే సిక్స్ ప్యాక్ కూడా వస్తుందని సీఎం చమత్కరించారు. సిక్స్ ప్యాక్ కోసం ఎవరూ జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం యువత కోసం ఒక్క ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎవరెన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వం కొలుకునేందుకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వడం లేదని, ఏమాత్రం సర్దుకోనివ్వడం లేదని ఆక్షేపించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, సీస్ రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందరావు, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి,  కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి రైతు ఖాతాలో సొమ్ము జమ

రైతు ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ అవుతుందని భరోసానిచ్చారు. జమ చేయడంలో ప్రభుత్వం పరిమితులు పెట్టుకోలేదని, ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు.  భూమిలేని నిరుపేదలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారని, ఆయా కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రూ.12,000 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు.

ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, రూపాయి, రూపాయి పోగుచేసి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నదని తెలిపారు. ఇంత మంచి పథకాలు అమలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ అంటేనే రైతులు, రైతులంటే కాంగ్రెస్ అని అభివర్ణించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.

రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు రుణమాఫీలో భాగంగా రూ.21 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. ఇలాంటి గొప్ప సాహసం భారతదేశంలో మరే ఇతర రాష్ట్రంలో జరగలేదన్నారు. సన్నాలకు క్వింటాకు 500 చొప్పున బోనస్ కింద 1,199 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో పంట నష్టం జరిగితే నాటి సీఎం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ అధికారంలో ఉన్నా పంట నష్టం జరిగితే ప్రతి పైసా లెక్క గట్టి రైతుల ఖాతాల్లో జమ చేశాయన్నారు.

తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాక పంట నష్టం కింద రూ.260 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. సీఎం తొలిరోజు రూ. 70,11,984 మంది అన్నదాతల ఖాతాల్లో రైతుభరోసా జమ చేశారని తెలిపారు. 

ఖాతాలో రైతు భరోసా జమైంది

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి 8 గంటల నుంచి రైతు భరోసా పథకంలో ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన బొలగాని పుషమ్మకు 1.39 ఎకరాల భూమి ఉండగా సాగు పెట్టుబడి కింద రూ.11,850 ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ మేరకు సోమవారం రాత్రి 8:01 గంటలకు ఆమె ఫోనుకు రైతు భరోసా నిధులు జమైనట్టు మెసేజ్ రావడంతో సంతోషం వ్యక్తం చేసింది.

రైతులతో సీఎం రేవంత్ ముఖాముఖి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

రాజేంద్రనగర్, జూన్ 16: రైతునేస్తం కార్యక్రమ ప్రారంభోత్సవం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రా ష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం తొలుత రం గారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెం దిన చౌదరిపల్లి రైతు వెంకటరామయ్య దం పతులతో మాట్లాడారు. తమకున్న మూ డు ఎకరాల్లో ఆకుకూరలు పండిస్తున్నట్లు దంపతులు వెల్లడించారు.

తమ ప్రాంతం లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, తమకు డ్రిప్ సిస్టం అందజేస్తే సాగుకు ప్ర యోజనకరంగా ఉంటుందని సీఎంను కోరారు. వారి అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌తో పాటు శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలు, పాలు వచ్చేవని, ఇప్పుడా పరిస్థితి లేదని సీఎం వాపోయారు. రంగారెడ్డి జిల్లా ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి అని, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిందన్నారు.

సీఎం తర్వాత భద్రాద్రి జిల్లా మల్లారం రైతువేదిక నుంచి కర్లపూడి బాలు అనే రైతుతో మాట్లాడారు. తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రైతువేదిక నుంచి మంకిన రామకృష్ణతో సీఎం మాట్లాడారు. ‘ఖమ్మం జిల్లా వాళ్లు హుషారోళ్లు, మూడు మంత్రి పదవులు తీసుకున్నారు’ అని పొంగులేటి, భట్టి, తుమ్మలను ఉద్దేశించి చమత్కరించారు. సీఎం తర్వాత నల్లగొండ జిల్లా చింతపల్లి ఇక రైతువేదిక నుంచి మహిళా రైతు రాణెమ్మతో మాట్లాడారు. ఆమె కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు.