03-12-2025 12:00:00 AM
నూతన డీసీసీలకు జనవరిలో శిక్షణ
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 2( విజయక్రాంతి) : పనితీరును మెరుగుపర్చుకోని వాళ్లు .. వాళ్లకు వాళ్లే పదవుల నుంచి తప్పుకోకుంటే పార్టీనే వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తుంది. గుజరాత్లో ఇదే జరిగింది.. తెలంగాణలోనూ అదే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ స్పష్టం చేశారు. అయితే పదవుల నుంచి తప్పించడం మూడు నెలలు కాకపోతే ఆరు నెలలు అవకాశమిస్తామని, అప్పటికీ పనితీరు బాగాలేకుంటే వారిని తప్పించి కొత్తవారిని నియమిస్తామని చెప్పారు.
మంగళవారం గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గం సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్ డీసీసీ నూతన అధ్యక్షులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2029లో రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. జనవరిలో డీసీసీ అధ్యక్షులకు ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు.
పదవీ కాలం ముగి సిన డీసీసీలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నూతన డీసీసీలకు మీనాక్షి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తు లేకపోయినా పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల సేకరణ జరగాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై కొట్లాడాలన్నారు.