02-02-2026 09:11:57 PM
చిట్యాల,(విజయక్రాంతి): శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చిట్యాల పట్టణంలో గుత్తా యువసేన జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు తన నివాసంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించగా, నకిరేకల్ ఎమ్మెల్యే , డిసిసి జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 08, 10 వార్డుల్లో ప్రచారం నిర్వహించి, చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిట్యాల పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నామని, గత ఐదు సంవత్సరాలుగా చిట్యాల పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రతి వార్డులో సిసి రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలు నిర్మించి చిట్యాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.