03-05-2025 12:00:00 AM
అది జూన్ మాసం. విశ్వవిద్యాలయంలో దూరవిద్యా కేంద్రం పక్షాన ఒక 10 రోజులు దూరవిద్యలో ప్రవేశం పొందిన వారికి పాఠాలు చెప్పాలి. అందుకు అదనంగా విశ్వవిద్యాలయం పారితోషికం ఇస్తుంది. నా ఉద్యోగం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే కనుక ఆర్ట్స్ కళాశాలలో క్లాసులు తీసుకుంటున్నాను.
నా సబ్జెక్టు వ్యాకరణం. ఐదు రోజులే నాకు కేటాయించారు. సంజ్ఞా, సంధి, సమాస, తద్థిత కారక పరిచ్ఛేదాలను నేను బోధించాలి. చిన్నయసూరి వ్యాకరణాన్ని పదేళ్లు చదివి, ఇరవై ఏళ్లు ఎంఏ విద్యార్థులకు బోధించిన అనుభవం నాది. నాకు వ్యాకరణం బోధించిన వారుకూడా సామాన్యులు కారు.. ఆచార్యవర్యులు అమరేశం రాజేశ్వరశర్మ, రవ్వా శ్రీహరి, మోత్కూరు నరహరి.
ఆరోజు మొదటిరోజు. సంజ్ఞల గురించి చెప్తున్నాను. సంస్కృత సంజ్ఞల ఆధారంగానే తెలుగు వ్యాకరణలో సంజ్ఞలు గ్రహింపు ఉంటుంది. నేను వ్యాకరణం చెప్పేటప్పుడు లోకంలోని ఉదాహరణలు తీసుకుంటాను. తత్సమం, తద్భవం, పరుష సరళులు, దేశ్యం, గ్రామ్యం అనే పదాలు కూడా సంజ్ఞలే.
సంజ్ఞలంటే పేర్లు. పరమేశ్వరుని సంజ్ఞ ‘ఓం’. సంజ్ఞలతోనే ప్రపంచ పదార్థాలు గుర్తింపు పొందుతున్నాయి. పరమేశ్వరుని సహజనామం ఓం అని, అతనికి ఉన్న ఇతర నామాలన్నీ విశేషాలనీ ఆధ్యాత్మిక గురువులవల్ల తెలుసుకున్నాను. ఈ సంజ్ఞా ప్రకరణమంటే నాకూ చాలా ఇష్టం.
పాఠం చెబుతూ ఒకసారి క్లాసులో ఉన్నవారిని గమనించాను. వారిలో సుప్రసిద్ధ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కనిపించారు. ఆశ్చర్య పోయాను. ‘అమ్మో! దూరవిద్యలో ఎంఏ చేయడానికి మహామహులు కూడా వస్తారన్నమాట’ అనుకున్నాను. ఓ గంటసేపు సంజ్ఞలు, వాటి నేపథ్యం గురించి సోదాహరణంగా వివరించాను. ఎవరూ ఏ ప్రశ్నలూ వేయలేదు. క్లాసు ముగిసిందని చెప్పి గది బయటికి వచ్చాను. ఇంతలో
“చెన్నప్ప గారూ! మీతో మాట్లాడవచ్చా?” అన్నమాట నా వెనుకనుంచి వినిపించి, తల తిప్పాను. పిలిచింది ఎవరో కాదు, జొన్నవిత్తుల వారే. సాదరం
“ఏమిటి! మీరు క్లాసుకు వస్తున్నారు ఎప్పట్నించి?” అని అడిగాను.
“అన్ని సబ్జెక్టులకూ ఇబ్బంది లేదు. ఒక్క వ్యాకరణం క్లాసు విందామని వచ్చాను.. ఈరోజు!” అన్నారు.
“అయిదు రోజులు క్లాసులు కదా, ఇన్నాళ్లూ ఉంటారా?” అని అడిగాను.
“ఒక్కరోజు వింటే సరిపోతుందనుకున్నాను. కాని, మీ పాఠం నన్నాకర్షించింది. ఇవ్వాళే మద్రాసుకు వెళ్లాలి. ఫ్లయిట్ టెక్కిట్ బుక్కయింది. కాని...” అని ఆగిపోయారు. తిరిగి జొన్నవిత్తుల వారే
“టిక్కెట్ క్యాన్సిల్ చేసుకొని మిగిలిన నాలుగు రోజులు మీ పాఠం వినాలని కుతూహలంగా ఉంది..” అన్నారు.
“చాలా సంతోషం. మీవంటి వారు మా క్లాసులు వినడమంటే మేం అదృష్టవంతులమే. తప్పకుండా అటెండ్ కండి” అన్నాను...
“మీరెక్కడ ఉంటారు?” అడిగారు జొన్నవిత్తుల.
“జామై ఉస్మానియాలో ఉంటాను. మా కాలనీ ఈ యూనివర్సిటీకి చాలా సమీపంలోనే ఉంది..” అన్నాను.
“నేను మీ ఇంటికి రావచ్చునా, ఇప్పుడు మీతోపాటు?” అని ప్రశ్నించారు. ఆనందంగా అంగీకరించాను.
పళ్లబుట్ట రూపంలో వాత్సల్యం
ఆర్ట్స్ కళాశాల మెయిన్ బిల్డింగ్ నుంచి బయటికి వచ్చి స్కూటర్ మీద వారిని ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాను. మార్గమధ్యంలో వారేమీ మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడలేదు. వారు మౌనంగా ఉండి నాకు డ్రైవింగ్లో కష్టం లేకుండా చేశారు. నిమిషాల్లోనే మా ఇంటి సమీపానికి వచ్చాం. జామై ఉస్మానియా బస్టాండు పక్కన పళ్ల దుకాణం దగ్గరకు రాగానే
“ఒక్క క్షణం, బండి ఆపండి!” అన్నారు. బండి దిగి ఒక బుట్టనిండా మామిడిపళ్లు కొన్నారు. ‘అన్ని పళ్లు! ఎవరి కోసమో..’ అనుకున్నాను.
వారు బుట్టను పట్టుకుని తిరిగి నా స్కూటరు మీద వెనుక సీటులో కూర్చున్నారు. కాసేపట్లో మా ఇంటి ముందు నేను స్కూటర్ ఆపి, జొన్నవిత్తుల వారిని ‘లోపలికి రమ్మని’ సాదరంగా ఆహ్వానించాను.
వారు లోపలికి వస్తూనే, నా కోసం ఎదురుచూస్తూ నిల్చున్న నా అర్థాంగి ప్రమీలను చూసి
“అమ్మా! ఈ పళ్లబుట్ట తీసుకోండి. ఇవాళ మీ వారు నాకు వ్యాకరణ పాఠం అద్భుతంగా చెప్పారు...” అన్నారు ఆనందం పట్టలేక.
జొన్నవిత్తుల వారితో అప్పుడు అలా ఏర్పడిన వాత్సల్యం దశాబ్దాలపాటు సాగింది. వారి కరుణ ఎంత గొప్పదో చెప్పడానికి నావద్ద అక్షరాలు లేవు. పదిమంది శత్రువులను సంపాదించుకోవడం కంటే జొన్నవిత్తుల వంటి ఒక మంచి మిత్రుణ్ణి పొందడం ఎంత అదృష్టమో కదా అనిపిస్తుంటుంది.
వ్యాసకర్త సెల్: 9885654381