calender_icon.png 3 June, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో ముందడుగు!

02-05-2025 12:00:00 AM

జనాభా లెక్కలతోపాటే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయానికి రావడం ఎంతైనా ముదావహం. సామాజిక విలువలు, ప్రయోజనాలను కాపాడటానికే ఈ కులగణన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అయితే, రాహుల్‌గాంధీ రెండేళ్లనుంచి ఎత్తుకున్న ఓబీసీ ఎజెండాను దెబ్బతీసే రాజకీయ ఎజెండాలో భాగంగానే ప్రభుత్వం ఈ అంశానికి ఆమోదముద్ర వేసిందనే విషయం సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాల ప్రకటన సందర్భంగా బుధవారం కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణనను కాంగ్రెస్ మొదటినుంచి వ్యతిరేకించిందని చెప్పారు.

కాంగ్రెస్‌సహా దాని మిత్రపక్షాలు ఈ అంశాన్ని రాజకీయ కోణంలోనే చూశాయని మండిపడ్డారు. దీనిద్వారా ఓబీసీలపై కాంగ్రెస్ కపటప్రేమ చూపిస్తుందనే భావనను కేంద్రమంత్రి ఆయా వర్గాల్లో కలిగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. నిజానికి ఓబీసీ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయిన విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తించారు. తిరిగి వాళ్ల అభిమానాన్ని చూరగొనేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ తరుణంలోనే భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన అంశాన్ని లేవనెత్తారు.

2019 సాధారణ ఎన్నికల్లో కేవలం 50 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ 2024 నాటికి 99 సీట్లను కైవసం చేసుకుంది. దీనికితోడు తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ హస్తం పార్టీ నేతలు కులగణన మంత్రం పని చేస్తుందన్న నిర్ణయానికి వచ్చేలా చేశాయి. అందువల్లే పార్లమెంట్‌లో దీనిపై రాహుల్‌గాంధీ తన గళాన్ని రెట్టింపు చేసి, బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన కులగణనను ఓబీసీలపట్ల తమకున్న అంకితభావానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన బీజేపీ పెద్దలు జనగణనలో భాగంగా కులగణన చేసేందుకు అంగీకరించారు. దీంతో కాంగ్రెస్ దగ్గర ఉన్న ఒక్కగానొక్క అస్త్రాన్ని లాక్కున్నట్టయ్యింది.

బీజేపీ ఓబీసీల రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకించింది. కులభేదాలకు అతీతంగా ఏకీకృత హిందూ విధానాన్ని సమర్థించింది. అటువంటిది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కులగణనకు అంగీకరించడాన్ని బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే భావించాలి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై కుల సమీకరణలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

జనగణన ఎప్పుడు మొదలు పెడతారో చెప్పకుండానే కులగణనపై ప్రకటన చేయడం ద్వారా బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే బీజేపీ ముందున్న తక్షణ లక్ష్యం అనే సంగతీ అవగతమవుతున్నది. బీజేపీ మిత్రపక్షమైన నితీష్ ప్రభుత్వం బీహార్‌లో కులగణన చేసి, రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది వెనుకబడిన తరగతుల వారే అని 2023లో ప్రకటించింది. వారి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ చర్యలైతే తీసుకోలేదు. పార్టీలు కులాలు, రిజర్వేషన్లను రాజకీయాలకు వాడుకోకుండా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగు పరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని గర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటే బావుంటుంది.