ఇది కదా అసలైన మార్పంటే?: హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ టు మల్లన్న సాగర్ - మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. తమ్మిడి హెట్టి నుంచి ఎల్లంపల్లికి రూ. 35,000 వేల కోట్లు అట అని హరీశ్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట అన్నారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీ అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 టీఎంసీ మాత్రమేనట! అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో(Kaleshwaram Lift Irrigation Project) పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట అని ఆయన మండిపడ్డారు. 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో మచ్చుతునక అని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress Government) ఇది కదా అసలైన మార్పంటే? అని ప్రశ్నించారు.




