25-07-2024 04:31:44 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్రంగా నిరాశపర్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఎన్నికల్లో గ్యారంటీల గారడీ చేసి.. ఇప్పుడు అంకెల గారడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్ లో గ్యారంటీ హామీల ప్రస్తావన లేదన్నారు. తెలంగాణ బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందన్నారు. ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ అని హరీశ్ ఆరోపించారు.
మహిళలందరికీ రూ. 2500 ఇస్తామన్నారు.. దీని గురించి ప్రస్తావించలేదు.. ఆసరా పెన్షన్లు పెంపు గురించి బడ్జెట్ లో ఊసేలేదన్నారు. విద్య భరోసా కార్డు అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయిందని ఆయన గుర్తుచేశారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదన్నారు. బడ్జెట్ లో జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై తాము నిర్లక్ష్యం చేశామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ కొనసాగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారని, నగర అభివృద్ధిని సూపర్ స్టార్ రజినీకాంత్ పొగిడారని ఆయన తెలిపారు. తాము చేసిన అభివృద్ధి రజినీకి కనిపించింది.. కానీ కాంగ్రెస్ గజినీలకు మాత్రం అది కనిపించలేదని రావు ఎద్దేవా చేశఆరు. బీఆర్ఎస్ పాలన కారణంగా తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని హరీశ్ రావు పేర్కొన్నారు.