calender_icon.png 16 November, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 గంటల్లో బోనస్.. ఇప్పటి రూపాయి ఇవ్వలేదు

16-11-2025 03:48:33 PM

సిద్దిపేట: జిల్లాలోని చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆరోపించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి కేవలం 5,6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. కొన్న వాటికి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

దాదాపు రూ.1200 కోట్ల వరకు ఎంఎస్పీ పెండింగ్ లో ఉందని, దాదాపు రూ.200 కోట్ల బోనస్ పెండింగ్ లో ఉందని విమర్శించారు. మాటల్లో 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, కావున వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మక్కా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు మక్కా కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో మక్కాలు పండించారు. వెంటనే మక్క రైతులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగం అయ్యింది. కేంద్ర బీజేపీ రైతులను అరిగోస పెడుతున్నదని, ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అంటే కొన్ని జిల్లాలో 11, 12 క్వింటాళ్ల పత్తి పండింది. వాళ్లు మిగిలిన పత్తిని ఏం చేయాలని ప్రశ్నించారు. ఒకవైపు జిన్నింగ్ మిల్ వాళ్ళు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సీసీఐ పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పత్తి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి దాపరించిందని, పత్తి రైతులను బీజేపీ ప్రభుత్వం, మక్క రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా మోసం చేశాడని, రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండని, బోనస్ లేదు, పంటల బీమా లేదు, సగం మందికే రుణమాఫీ చేశారని విరుచుకుపడ్డారు. పోయిన యాసంగిలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు, ఈ ఏడాది తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందలేదని చెప్పారు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేవని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.