19-05-2025 05:17:55 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయిందని, బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ దిక్కు లేకుండా పోయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ తెరమీదకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అర్బాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప, అమలు చేసే డెడికేషన్ మాత్రం అస్సలు లేదని హారీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ సదర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... తాను నల్లమల బిడ్డనని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తనను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డలను అరెస్టు చేసి తన నిరంకుశ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడని తెలిపారు. ఎక్కడిక్కడ ముందస్తు అరెస్టులు చేసి, చెంచు ఉద్యమ నాయకులను నిర్బందించి నల్లమల డిక్లరేషన్ ప్రకటించడమే ప్రజా పాలనా..? అని ప్రశ్నించారు.
ఎప్పటి లాగే రేవంత్ ప్రసంగంలో తెచ్చి పెట్టుకున్న ఆవేశం తప్ప, కంటెంట్ లేదు, కాంటెస్ట్ లేదన్నారు. తమ పరిపాలన అమలు కాని హామీలను ప్రజలతో పదే పదే గుర్తు చేసుకుంటున్నారని, రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రైతులు బావురుమంటున్నారు. రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన దాన్యాన్ని కల్లాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారని, వడగండ్లతో పంట నష్టపోయి గుండెలు బాదుకుంటున్న రైతులు మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారని చురకలాంటించారు. మహాలక్ష్మి కింద నెల నెలా రావాల్సిన 2500 ఇంకా రావడం లేదని ఆడబిడ్డలు, కల్యాణ లక్ష్మి కింద రావాల్సిన తులం బంగారం కోసం ఆడపిల్ల తల్లిదండ్రులు, మీరిస్తామన్న స్కూటీల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువతులు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
విద్యాభరోసా కింద ఇస్తామన్న 5 లక్షల కార్డు కోసం విద్యార్థులు, ఏడాదిలో ఇస్తామని చెప్పి ఏడాదిన్నర దాటుతున్నా రాని 2 లక్షల ఉద్యోగాల కోసం, ఏ నెలకు ఆ నెల ఖాళీలను భర్తీ చేస్తూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా పింఛన్లు పెంచుతలేవని అవ్వాతాతలు, దివ్యాంగులు, నిస్సహాయులు, డీఏ, పీఆర్సీ, పింఛన్ ప్రయోజనాల కోసం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, తమను ఎప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తారా అని ఆర్టీసీ కార్మికులు నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలుచుకుంటున్నారని హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి అతిశయోక్తులు ఎట్లా ఉంటాయంటే, అమాస నాడు పున్నమి వెన్నల అనగలడని విమర్శించారు.
ఓవైపు నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారని తుపాకి రాముని డైలాగులు పేలుస్తూ కామెడీ చేస్తున్నడన్నారు. దేశాలు తిరిగి తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న పెట్టుబడుల వ్యవహారం ఎట్లుందంటే, సచ్చిపోయిన బర్రె పగిలి పోయిన కుండెడు పాలు ఇచ్చిందన్న చందంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసలు ఆరు గ్యారెంటీల ఊసెత్తడమే మానేసిండని, ఇంతకన్నా మోసం, దగా ఇంకేం ఉంటుంది. గుడ్డిలో మెల్ల అన్నట్లు రాష్ట్రం దివాలా, దివాలా అన్న పాట మాత్రం పాడలేదు. నెంబర్ వన్ రాష్ట్రం అని మాట మార్చిండని, రేవంత్ రెడ్డి రంగులు మార్చే తీరును చూసి నల్లమల అడవుల్లోని ఊసరవెళ్లులు కూడా నివ్వెరపోతున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు.