రేవంత్ డ్రామాలో ఆయనో పావు
జస్టిస్ నరసింహారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడుతున్న రాజకీయ డ్రామాలో జస్టిస్ నరసింహారెడ్డి పావుగా మారారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. చీకటి నిండిన తెలంగాణలో కరెంటు వెలుగులు నింపిన దార్శనీకుడు కేసీఆర్ అన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ విద్యుత్ లోటు నుంచి ఉత్పత్తి స్థాయికి ఎదగడం అనేది సాధారణ విషయం కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలను, స్వరాష్ట్రంలో నిర్విరామ కరెంటు సౌలభ్యం నరసింహారెడ్డి కుటుంబం అనుభవంలో ఉన్నదేనన్నారు.
తెలంగాణ పసికూనగా ఉన్నప్పుడే రాజ్యాం గ సంక్షోభం సృష్టించాలని ఆంధ్ర పాలకులు విసిరిన పాచిక రేవంత్రెడ్డి అని, ప్రస్తుతం అధికారం పీఠం మీద కూర్చుని తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కీర్తికి మసిపూయాలనే రాజకీయ కుట్రతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చట్ట విరుద్ధమైన విచారణ కమిషన్ వేశారని విమర్శించారు. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను కాదని కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా కమిషన్ పనితీరు సాగుతుందన్నారు. దీనిని జస్టిస్ నరసింహారెడ్డి పదవీ విరమణ అనంతరం ఉపాధి కోసం భుజాన వేసుకుని కార్యంగానే భావిస్తున్నానన్నారు. విచారణ కమిషన్ ప్రవర్తన అనుమానస్పదంగా, అక్షేపనీయంగా ఉందన్నారు. ఆయన ప్రతి కదలిక రేవంత్ డైరెక్షన్లోనే సాగుతున్నట్లు తెలుస్తుందని, తెలంగాణ పౌరులు ఎవరు దీని సమర్థించరన్నారు. తెలంగాణ బిడ్డగా ఆయన హూం దాగా పదవి నుంచి తప్పుకుని రాష్ట్ర ఖ్యాతి ని ఇనుమిడింపజేయాలని సూచించారు.






