25-05-2025 12:16:47 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో తమిళనాడు, కర్నాటక, మహారాష్ర్ట, ఏపీ వరకు విస్తరించే అవకాశం ఉంది. ఈ నెల 27న పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 5 నుంచి ౭ డిగ్రీలు తక్కువగా ఉండనున్నాయి. ఆదివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఇక ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఆ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.