02-11-2025 10:25:11 PM
“కృష్ణ అల్లుడిగా, మహేశ్ బావగానే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఎంతోమంది నిర్మాతలను కలిశా. ఆడిషన్స్ ఇచ్చా. యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీసుకి తిరిగా. నాకు దొరికింది ఒక కాఫీ మాత్రమే. అంతకుమించి నేను ఏదీ అడ్వాంటేజ్ తీసుకోలేదు. మహేశ్బాబు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన్ను ఏనాడూ అడగలేదు. చాలామంది నన్ను నెపో కిడ్ అంటున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు టాలీవుడ్ హీరో సుధీర్బాబు.
ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘జటాధర’. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ పాన్-ఇండియా మూవీకి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఉమేశ్కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్హల్, నిఖిల్ నందా నిర్మించారు. నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో సుధీర్బాబు మాట్లాడుతూ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ.. “ఈ రోజు కొన్ని నిజాలు మీతో చెప్పాలనుకుంటున్నా. సుధీర్బాబు అంటే ఎవరని నన్ను నేను చాలాసార్లు అడిగాను. కృష్ణ అల్లుడు, మహేశ్బాబు బావ. ఇది నేను గర్వంగా ప్రేమగా ఒప్పుకుంటున్నా. నేను నటుడిని కావాలనుకున్న సందర్భాన్ని తలచుకుంటే భయమేస్తుంది. కోరిక ఎంత బలంగా ఉందో బాధ్యత కూడా అంతే ఉంది. యాక్టర్గా ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అనే భయాలు ఉండేవి. నేను మొండివాడిని. ఒక స్పోర్ట్స్ పర్సన్ని. మా అమ్మానాన్న ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం ఎప్పుడూ నేర్పించలేదు.
కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు కానీ, ఫిలింనగర్ బాధలు తెలుసు. కళ్ల ఎదురుగా తిండి ఉండి, నిరాశతో ముద్ద దిగిన ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు. బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు. ఇవన్నీ నేను సానుభూతి కోసం చెప్పట్లేదు. అలా అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పేవాడిని. ఇప్పుడు నాకు సింపతీ అవసరం లేదు. ప్రేమ, గౌరవం చాలు. మీరంతా మహేశ్బాబుపై ప్రేమతోనే వచ్చారు. అందరికీ థాంక్యూ. కానీ, ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారు. నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారు. నాకు మనసుకు తెలుస్తుంది. ఆ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. గెలిచే వరకు కూడా పోరాడాలి. లేదా చచ్చే వరకు పోరాడాలి. జటాధరలో డైలాగ్ ఇది. నా రియల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. ఒక్క సినిమా చాలు అనుకున్న వాడిని 20 సినిమాలు చేశా. ఆ 20 సినిమాల్లో హిట్టుకు కారణం నా కష్టం. ఫ్లాఫ్కి కారణం కూడా నా ఫెయిల్యూరే.
జటాధర నేను చేసిన 20 సినిమాల్లో ది బెస్ట్ స్క్రిప్ట్. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్ ఏ హీరో చేయలేదు. ఈ సినిమా దెయ్యాలు, దేవుడు ఉన్నాయని విశ్వసించేవారికి, లేవని నమ్మేవారికి.. ఇద్దరికీ సమానంగా నచ్చుతుంది. ఈ సినిమా కోసం శివతాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇదంతా ఆ శివుని దీవెనలుగా భావిస్తున్నా. ఈ సినిమాలో ఒక 15 నిమిషాల సీక్వెన్స్ ఉంటుంది. అది గూస్బంప్స్ తెప్పిస్తుంది. కార్తికేయలో కృష్ణుని గురించి చెప్పే ఒక ఎపిసోడ్ ఉంటుంది. శివుని గురించి చాలా మంచి ఎపిసోడ్స్ ఉంటాయి. అరుణాచలం వెళ్లే వాళ్లు ఈ సినిమా ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవుతారు” అన్నారు.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “జటాధర టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని ఆ పరమశివుని వేడుకుంటున్నా. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ షాట్ అదిరిపోయింది” అని చెప్పారు.
శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. “సుధీర్బాబు మాకు ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి జనరేషన్స్గా ప్రేక్షకులు సపోర్ట్ని అందిస్తున్నారు. నవంబర్ 7న కూడా అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నా. చాలా ప్రేమతో చేశాం. సుధీర్బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మేమందరం మహేశ్బాబు సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే ముందు ఈ సినిమాను మీరంతా చూడాలని కోరుకుంటున్నా” అన్నారు.
ప్రొడ్యూసర్ శివిన్ మాట్లాడుతూ.. “ప్రేరణకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం.. మాకు గౌరవం. ఇక్కడ చాలా కష్టపడి పాషన్తో సినిమాలు చేస్తారు. సుధీర్బాబు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సోనాక్షి, శిల్పా క్యారెక్టర్స్ కూడా అందరిని అలరిస్తాయి” అని తెలిపారు.
‘నాకు తెలుగు పరిశ్రమ అంటే చాలా ఇష్టం. మహేశ్బాబు, సుదీర్బాబులకు నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సుధీర్బాబు నా ఫస్ట్ తెలుగు యాక్టర్. శిల్ప చాలా సపోర్ట్ చేశారు’ అన్నారు నిర్మాత ప్రేరణ అరోరా.
ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యదువంశీ, ప్రొడ్యూసర్ విష్ణువర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్, చిత్రబృందం పాల్గొన్నారు.