calender_icon.png 22 June, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథా ప్రతి నాయకులు!

22-06-2025 12:00:00 AM

చిత్ర పరిశ్రమలో ప్రతినాయకుడిగా ప్రయాణం ప్రారంభించి, కథానాయకుడిగా మెప్పించినవారు ఎందరో! హీరోగా కెరీర్‌ను ఆరంభించి, విలన్ వేషాల్లో కనిపించినవారూ బోలెడు మందే ఉంటారు. ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్‌గానూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు కొందరు తెలుగు స్టార్స్. విలన్ వేషాల్లోనూ తమ సత్తా చాటేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా హీరో.. విలన్‌గా నటించిన సినిమాలు 

ఇటీప్పుడు వరుస కట్టాయి. 

తెలుగు చిత్రపరిశ్రమలో ఏదైనా సాధ్యమే. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, స్టార్‌డమ్‌ను సైతం పక్కన పెట్టి కథ డిమాండ్ చేసే పాత్రలో కనిపించేందుకు వెనుకాడరు. అలా హీరో లు.. విలన్ వేషాల్లో తెరపై సందడి చేసిన సినిమాలు ఇటీవల చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ కథ నంలో ప్రధానంగా పేర్కొన్న వారే కాక.. రానా దగ్గుబాటి, సందీప్ కిషన్, నవీన్‌చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ, వరుణ్ సందేశ్ వంటివారు ఒకవైపు హీరోగా నటిస్తూనే ప్రతినాయక పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. 

‘కుబేర’.. ‘కూలీ’ల్లో నాగార్జున 

 నాగార్జున అక్కినేని.. ఇప్పటివరకు చేయని హీరో రోల్ లేదనే చెప్పాలి. మరి విలన్ రోల్‌లో కనిపిస్తే? అనే ఆశ తాజాగా విడుదలైన శేఖర్ కమ్ముల ‘కుబేర’తో సగం తీరినట్టయ్యింది. ‘కుబేర’ జూన్ 20న విడుదల కాగా.. నాగార్జున కొంచెం ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించారు. ఇంకా రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్న ‘కూలీ’లో నాగా ర్జున.. సైమన్ అనే పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారట.  సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘బ్రహ్మరాక్షస’గా ప్రభాస్ 

‘హనుమాన్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కించనున్న హోంబలే ఫిలింస్ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఈ సినిమాలోనే ప్రభాస్.. విలన్‌ను తలపిస్తూ.. బ్రహ్మరాక్షసుడిలా కనిపిస్తారట. అయితే, ఈ సినిమా పట్టాలెక్కడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేట్టు ఉంది. 

బాలీవుడ్‌లో ఎన్టీఆర్ ‘వార్’.. 

హీరోగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన ఎన్టీఆర్.. ‘జై లవకుశ’, ‘టెంపర్’ల్లో హీరోగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలోనూ మెప్పించారు. అదే తరహా పాత్రతో బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా యష్‌రాజ్ ఫిల్మ్స్ ‘వార్2’ చిత్రాన్ని నిర్మి స్తోంది. ఇందు లో ఎన్టీఆర్ కూడా భాగమయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో  ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్ర పేరు వీరేంద్రనాథ్ అని టాక్.  ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. 

హీరో.. విలన్.. రెండూ అల్లు అర్జునే! 

పుష్ప2తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ‘ఆర్య2’ చిత్రంలో అల్లు అర్జున్ నటించింది హీరోగానే అయినప్పటికీ ఆ పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయి. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తునన్నారు. ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారని.. ఆ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ముంబయిలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించి, ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొంటున్నారని.. పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు న్నారని టాక్. 

‘భైరవం’లో మంచు మనోజ్ 

మంచు మనోజ్ ‘భైరవం’తో రీఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా లోకేశ్, మంచు మనోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మనోజ్ నటించిన గజపతివర్మ అనే పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో కూడుకున్నది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్‌ది బ్లాక్‌స్వార్డ్ అనే విలన్ పాత్ర అని ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ద్వారా అర్థమవుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వనాథ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. 

తమిళ చిత్రంలో సుహాస్ 

తమిళ స్టార్ సూరి, తెలుగు హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తుండగా.. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో సుహాస్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో అలరించనున్నారు. అయితే, సుహాస్ ప్రతినాయకుడిగా నటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్2’ చిత్రంలోనూ సుహాస్ విలన్‌గా నటించారు. 

మోహన్‌బాబు ఎవరికి విలన్? 

మోహన్‌బాబు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని కథానాయకుడిగా ‘ది పారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఓ కథను వినిపించడానికి మోహన్‌బాబును ఇటీవల కలిసిన శ్రీకాంత్ ఓదెల.. విలన్ పాత్రలో నటించాలని ఆయన్ను ఒప్పించినట్టు టాక్. అయితే, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చే ఈ రెండు సినిమాలల్లో మోహన్‌బాబు ఎందులో ప్రతినాయకుడిగా కనిపిస్తారనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ‘బిల్లా రంగా’ చిత్రంలో చిరంజీవికి విలన్‌గా కనిపించిన మోహన్‌బాబు మరోమారు మెగాస్టార్‌తో యాక్షన్ సీన్స్ పండించడానికి సిద్ధమవుతున్నారా? లేక నానికి విలన్‌గా మారనున్నారా? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.