22-11-2025 02:00:07 AM
హుస్నాబాద్, నవంబర్ 21: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాతో పాటు, ఆయన సహచరి రాజే, ఏవోబీ రాష్ట్రకమిటీ సభ్యుడు శంకర్ సహా ఏడుగురు నాయకులను పోలీసులు పట్టుకొని క్రూరంగా హత్య చేశారని ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ శుక్రవారం లేఖను విడుదల చేశారు. మారేడుమిల్లి, రంపచోడవరంలలో జరిగిన ఎన్కౌంటర్లు బూటకమన్నారు. హిడ్మా ఆయన సహచరి రాజే కొద్దిమందితో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని తెలిపారు.
చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన సమాచారం పోలీసులకు చేరిందన్నారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ బృం దాలు నిరాయుధంగా ఉన్న హిడ్మా బృం దాన్ని అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. లొంగదీసుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, ఆ ప్రయత్నం విఫలం కా వడంతో వారిని క్రూరంగా హత్య చేశారని, ఆ తర్వాతే మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని ప్రకటించడం అంతా పచ్చి అబద్ధాలు అని తెలిపారు.
ఏవోబీ రాష్ట్రకమిటీ సభ్యుడు శంకర్ను కూడా హత్య చేసి, రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని మరో అల్లారని మండిపడ్డారు. దేశంలో ఆర్ఎస్ఎస్, -బీజేపీ మను వాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని, నిత్యం హత్యలతో ప్రజలను భయభ్రాంతులను చే సే ప్రయత్నం చేస్తున్నారని అభయ్ ఆరోపించారు.
దేశ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలను అణచివేయడానికే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ హత్యకాండకు వ్యతిరేకంగా ఈ నెల 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని అభయ్ ప్రజలకు పిలుపునిచ్చారు.