27-06-2025 03:14:11 PM
అనంతగిరి: వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు అధిక ఆదాయం పొందాలని పతంజలి ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్ కోరారు. మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో నూతనంగా ఆయిల్ పామ్ తోట సాగుచేస్తున్న ఎడ్లపల్లి శ్రీనివాస్ రావు వ్యవసాయ క్షేత్రంలో మేఘ ప్లాంటేషన్ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని అన్నారు. ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం గా డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పారు. నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ క్షేత్ర సహాయకులు మట్టపల్లి నరేష్ గౌడ్, లక్ష్మణ్ పలువురు రైతులు పాల్గొన్నారు.