14-11-2025 10:24:44 PM
ఆయిల్ ఫామ్ రైతులకు ప్రభుత్వ సబ్సిడీ
మార్కెట్ సమస్య లేకుండా పంట కొనుగోలు ఒప్పందం
సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం వెలిమినేడు పాక్స్ పరిధిలోని రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు కార్యక్రమం సింగిల్ విండో కార్యాలయం లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి మాట్లాడుతూ....ఆయిల్ పామ్ సాగు ఎకరానికి 57 మొక్కలను నాటుకోవచ్చని, వరి కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని, దీనికి ప్రభుత్వం తరపున సబ్సిడీ వస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు ఒక్కసారి నాటితే 4 వ సంవత్సరం నుండి మొదలై 35 సంవత్సరాల పాటు ప్రతి నెల ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ అన్నారు.
అదేవిదంగా భారత దేశం లో పెరుగుతున్న జనాభా తగ్గట్టు గా ప్రతి ఒక్కరికి ఆహారంలో కనీస అవసరం అయినా నూనె పంట ఇది, ఇప్పటికే మన దేశానికి సరిపడా నూనె పంట సాగులో లేని కారణంగా మన దేశవ్యాప్తంగా ఉన్న అవసరాలకు సుమారు 80,000 నుండి 1,20,000 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా నూనె కోసం మనం ఖర్చు చేస్తున్నాము అని, మన జిల్లాలో లో ఇప్పటికే దిగుబడులు కూడా ప్రారంభం అయ్యాయి, మన మండలంలో కూడా నీరు ఉన్న రైతులు ఆయిల్ పామ్ పంట వేయడానికి ముందుకు రావాలని దీనికీ ప్రభుత్వం కూడా పెద్దఎత్తున సబ్సిడీ లు ఇస్తుంది.
కేవలం 20/- లకే ఒక్కో ఆయిల్ పామ్ మొక్కలు ఇస్తుంది, డ్రిప్ పరికరాలు కూడా ఎస్సీ, ఎస్టి రైతులకు 100%, బీసీ రైతులకు 90%, ఓసి రైతులకు 80% రాయితీ వస్తుంది. మొక్కలు పెంచినందుకు ఎకరాకు 4,200/- రూపాయలు 4 సంవత్సరాల పాటు ఇస్తుంది. దాంతో అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో మన దేశ అవసరాలు తీరి రైతులు ఆర్దికంగా బలపడాలి అంటే ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలని కోరారు. మార్కెట్ సమస్య కూడా లేదు ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్ ద్వారా ఇప్పటికే వేసిన రైతులు చెప్పిన ప్రకారం ఎకరానికి సుమారు 1 లక్ష్మ నుండి 1 లక్షా 50 వేల వరకు నికర ఆదాయం వస్తుంది అని తెలిపారు.