31-12-2025 12:41:52 AM
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, డిసెంబర్ 30: వ్యవసాయ సాగులో పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి ఈర్ల శంకర్, జిల్లా ఉద్యానవన అధికారి అనితలతో కలిసి డివిజన్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, పశు వైద్య - పశుసంవర్ధక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
వ్యవసాయ సాగులో పంట మార్పిడి విధానం అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థిక అభివృద్ధి చెందవచ్చన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు మాత్రమే కాకుండా వాణిజ్య పంట లు, కూరగాయల సాగు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా వరి పంట సాగు విస్తీర్ణం అధిక మొత్తంలో ఉన్నందున రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
జిల్లాలో నమోదు అయిన సాగు విస్తీర్ణానికి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యచరణ ప్రకారం అవసరమైన ప్రతి రైతుకు నిబంధనల ప్రకా రం యూరియా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.